R Krishnaiah : ఆర్ కృష్ణయ్య అడుగులు ఎటువైపు.. బీసీ ఉద్యమాన్ని ఎందుకు మళ్ళీ భుజానికెత్తుకున్నారు?

బీసీ ఉద్యమకారుడు ఆర్. కృష్ణయ్య వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. మరోసారి బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు. దీనికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ను ప్రకటించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 25, 2024 6:06 pm

R Krishnaiah

Follow us on

R Krishnaiah : మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన సమయంలోనే ఆర్. కృష్ణయ్య కూడా గుడ్ బై చెబుతారని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు తాను వైసీపీకి రాజీనామా చేయబోనని కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన హఠాత్తుగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. అయితే కృష్ణయ్య పార్టీని ఏర్పాటు చేస్తున్నారని కొద్దిరోజులు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కృష్ణయ్య బిజెపితో సంప్రదింపులు జరుపుతున్నారని.. రాజ్యసభ సీటు ఇస్తారనే హామీ లభించిందని.. దీంతో ఆయన త్వరలోనే బిజెపిలో చేరుతారని తెలుస్తోంది.. రాజ్యసభ పదవి హామీ ఇవ్వడం వల్లే కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేశారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని బిజెపిలో బీసీ నేతలు ఎక్కువగా ఉన్నారని చర్చ జరుగుతున్న సమయంలో.. కృష్ణయ్యను చేర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఆసక్తి చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే దీని వెనుక ఎవరున్నారనే సందేహం బిజెపి కింది నాయకుల మెదళ్లను తొలుస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బీసీ నినాదాన్ని వినిపిస్తోంది. అయితే దీనిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఆయనపై కొంతమంది సీనియర్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారని చర్చ నడుస్తోంది. బీసీ నాయకులు కూడా అటు ఈటల, ఇటు బండి వర్గాలుగా విడిపోయారని ప్రచారం ఉంది. ఈటల రాజేందర్ కు చెక్ పెట్టడానికి బండి సంజయ్ కృష్ణయ్యను పార్టీలోకి తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని సంజయ్ అనుచరులు ఖండిస్తున్నారు. సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు చేశారో అందరూ చూశారని.. ఆయన ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండి పడుతున్నారు. ఈటెలకు, బండికి మధ్య విభేదాలు లేవని.. కొంతమంది కావాలని సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.. బిజెపి అనేది అన్ని సామాజిక వర్గాల పార్టీ అని.. కేవలం అందులో బీసీలు మాత్రమే పెత్తనం సాగిస్తున్నారని చెప్పడం సరికాదని వారు హితవు పలుకుతున్నారు.

కృష్ణయ్య రాజీనామాతో..

కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత బీసీ నినాదాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కడానికి తాను కృషి చేస్తానని కృష్ణయ్య వ్యాఖ్యానించారు. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా బీసీ ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు.. అటు కృష్ణయ్య బిజెపి నుంచి.. ఇటు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో బీసీ నినాదం కీలకంగా మారుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే రాజకీయ నాయకులు తమ ప్రాపకం కోసం మాత్రమే ఈ బీసీ నినాదాన్ని వాడుకుంటారా? లేకుంటే నిజంగానే బీసీల కోసం పాటుపడతారా? అనేది చూడాల్సి ఉంది.