Prashant Kishor And Jagan: ఎవరికైనా మేలు చేస్తే కృతజ్ఞతగా ఉండాలంటారు. కృతజ్ఞత చూపాలంటారు. కానీ ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీకి కృతజ్ఞతలు లేదని.. ఒకప్పుడు ఆ పార్టీ గెలుపు కోసం సహకరించిన ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డికి సహకరించే పరిస్థితి ఉండదని.. ఆయనతో కలిసి పని చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. తనకోసం కృషిచేసిన కుటుంబ సభ్యులకైన ఆయన కృతజ్ఞత చూపని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు పీకే. ప్రముఖ జర్నలిస్టు ఇంటర్వ్యూలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత సారాన్ని గుర్తుచేస్తూ.. కృతజ్ఞత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ తేల్చి చెప్పారు. అయితే ఏదో ఒక విషయంలో ప్రశాంత్ కిషోర్ హర్ట్ అయినట్లు స్పష్టం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన అహం పై దెబ్బ తీసినట్లు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ గెలుపు కోసం కృషి చేస్తే.. అది తన విజయం అని జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కారణం అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
* తెర వెనుక పీకే వ్యూహాలు..
తమిళనాడులో విజయ్( Vijay) గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఉన్నాయి అనేది బహిరంగ రహస్యం. కచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయ్ వందకు పైగా సీట్లలో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్. కానీ అంతా లైట్ తీసుకున్నారు. కానీ దశాబ్దాల చరిత్ర కలిగిన రెండు పార్టీలను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచారు విజయ్. ఎక్కడో ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపడం వల్లే అక్కడ గెలుపు సాధ్యమైందని ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది. అయితే ఇప్పుడు అదే విజయ్ కు వ్యూహాలు పన్నిన ప్రశాంత్ కిషోర్ పూర్తిగా గాలి తీసేశారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని పూర్తిగా బయటపెట్టేశారు.
* పూర్తి స్పష్టత..
2017లో రాజకీయ వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డికి సేవలందించడం ప్రారంభించారు ప్రశాంత్ కిషోర్( Prashant Kishor). అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ప్రశాంత్ కిషోర్ కు తెలుసు. జగన్మోహన్ రెడ్డి పై ఉన్న సానుభూతిని ప్రజాభిమానంగా మార్చడంలో ప్రశాంత్ కిషోర్ కృషి ఉంది. ఆ ఎన్నికల్లో 151 సీట్లు సాధించడం ద్వారా దేశంలోనే అందరి చూపు జగన్ పై పడింది. అధికారంలోకి వచ్చింది మొదలు ఆయన గెలుపు కోసం కృషిచేసిన ఒక్కొక్కరు దూరమవుతూ వచ్చారు. ముందుగా ప్రశాంత్ కిషోర్ దూరమయ్యారు. చెల్లెలు షర్మిల తో పాటు తల్లి విజయమ్మ సైతం దూరం జరిగారు. జగన్ గెలుపు కోసం కృషిచేసిన ఏ ఒక్క ఆత్మీయుడు ఆయన వద్ద లేరు. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. కృతజ్ఞత నిలుపుకోలేని వ్యక్తి అంటూ జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. మరి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సేవలు అందించనని కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.