AP Elections 2024: ఎవడైనా బలంగా కొడతాడు.. కోపంతో కొడతాడు.. వీడేంట్రా శ్రద్ధగా కొట్టాడు. మహేష్ హీరోగా నటించిన అతడు సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్ ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన ఈ డైలాగ్ పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ రూపంలో బయటపడింది.
తన పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు సీఎం జగన్ తరచూ చెబుతుంటారు. ఐదేళ్ల పాలనలో చాలా రకాల విప్లవాలు తెచ్చినట్లు గొప్పగా చెప్పడం జగన్ కే చెల్లింది. అయితే ఆయన చెప్పే విప్లవాత్మక పాలనను కాసేపు పక్కన పెడితే.. ప్రభుత్వ బాధిత వర్గాలు పెద్ద విప్లవమే సృష్టిస్తున్నాయి. కానీ ఇది తెలియని జగన్ విప్లవం అనే పదం బాగుంది కదా అని ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఆ విప్లవం అనే పదానికి అర్థం తెలిసి వచ్చింది. అది కూడా ఉద్యోగ, ఉపాధ్యాయుల రూపంలో. పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఆ రెండు బాధిత వర్గాలు పెద్ద విప్లవ రుచిని చూపించాయి. జగన్కు తత్వం బోధపడేలా చేశాయి.
సాధారణంగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు పెద్దగా ఓట్లు వేసేందుకు ఇష్టపడరు. ఏనాడైతే నోటిఫికేషన్ వస్తుందో.. నాటి నుంచే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎలక్షన్ కమిషన్ పరిధిలో చేరుతారు. వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉంటుంది. కానీ అది వేయాలంటే ఒక ప్రహసనంతో కూడుకున్న పని. అందుకే పెద్దగా వేసేందుకు ఇష్టపడరు. కానీ జగన్ చెప్పే విప్లవాత్మక పాలన వారికి నచ్చలేదు. తమపై చూపిన విప్లవం అస్సలు రుచించలేదు. అందుకే ఎప్పుడూ లక్షన్నర పోలయ్యే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. ఈసారి ఐదు లక్షల వరకు చేరుకున్నాయి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అటూ ఇటూ తిప్పినా ఓపికగా ఓటేశారు.. గంటల తరబడి నిలబడాల్సి వచ్చినా వెనక్కి తగ్గలేదు.
అయితే 90 శాతానికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పెరగడానికి.. ఉద్యోగుల్లో ఓటు చైతన్యం రావడానికి మాత్రం జగనే కారణం. ఓటు విప్లవం పోటెత్తడానికి ఆయన వైఖరి ముమ్మాటికి కారణం. వైసీపీ ఇచ్చే డబ్బులకు ఆశపడి పోస్టల్ బ్యాలెట్ ల కోసం ఎగబడి దరఖాస్తు చేసుకున్నారని ఒకరు.. 80% సచివాలయ ఉద్యోగులు ఓటు వేసి వైసిపి ప్రభుత్వ రుణం తీర్చుకున్నారని మరొకరు.. ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు కానీ.. నిజమేంటో వారికి తెలుసు. ఉద్యోగ ఉపాధ్యాయులు అంతగా పట్టుబట్టి ఎవరికి ఓట్లు వేశారో కూడా తెలుసు. ఇప్పుడు ఉద్యోగులు తమ భవిష్యత్తుతో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎక్కువమంది ఓటు బాధ్యతను నిర్వర్తించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. కానీ జగన్ చెబుతున్నట్టు విప్లవం సృష్టించేందుకు తమ బ్యాలెట్ ఓటుతో గట్టిగా సమాధానం చెప్పిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు అభినందించాల్సిందే.