Posani Krishna Murali: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ). వందలాది సినిమాలకు కథలు రాసిన చరిత్ర ఆయనది. పైగా నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. ఆ సమయంలోనే రాజకీయాల వైపు అడుగులు వేశారు. జగన్మోహన్ రెడ్డికి బలమైన మద్దతు దారుగా నిలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని బాగానే వ్యక్తపరిచేవారు. ఈ క్రమంలో ఆయన జగన్ ప్రత్యర్ధులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడేవారు. అయితే దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు పాలయ్యారు. చాలా రోజులపాటు జైల్లోనే ఉండిపోయారు. చివరకు ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. పెద్దగా కనిపించకుండా మానేశారు.
Also Read: నేపాల్ లో 215 మంది ఏపీ పౌరులు.. రంగంలోకి లోకేష్
* ప్రజారాజ్యం ద్వారా ఎంట్రీ..
ప్రజారాజ్యం( Praja Rajyam) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పోసాని కృష్ణ మురళి. 2009 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి పోటీ చేశారు కూడా. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో పోసాని కృష్ణమురళి సైలెంట్ అయ్యారు. తరువాత వైయస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానిగా మారిపోయారు. బలమైన మద్దతుదారుడుగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి సైతం పోసాని విషయంలో కృతజ్ఞతా భావం చాటుకున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. అయితే ఆ పదవిలో ఉంటూ కృష్ణ మురళి రాజకీయ ప్రత్యర్థులను వెంటాడారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత కామెంట్లు కూడా చేసేవారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులను తిరగతోడుతూ పోసాని కృష్ణ మురళి అరెస్ట్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లకు తిప్పడంతో పోసాని చాలా బాధపడ్డారు. న్యాయస్థానంలోనే కన్నీటి పర్యంతం అయ్యారు. అనవసరంగా రాజకీయాల జోలికి వచ్చి ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చారు. అయితే ఆయన అరెస్టుకు ముందే.. తాను రాజకీయాల నుంచి బ్రేకప్ అవుతానని ప్రకటన చేశారు. కానీ వైసీపీ హయాంలో ఆయన వ్యవహరించిన వైఖరి తెలియంది కాదు. అందుకే ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
* దసరాకు కొత్త సినిమా..
రాజకీయ వివాదాల పుణ్యమా అని.. గతం మాదిరిగా సినిమా అవకాశాలు తగ్గాయి పోసానికి. అందుకే ఇప్పుడు సినీ రంగంలో తానే సొంతంగా సెకండ్ ఇన్నింగ్స్( second innings ) ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నారు. దసరాకు కొత్త సినిమా మొదలు పెడుతున్నారు. ఆపరేషన్ అరుణ రెడ్డి పేరుతో.. జర్నలిస్ట్ కథ ఇతివృత్తంతో ఓ సినిమాను రెడీ చేసుకున్నారు. ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాలో కీలక పాత్రధారి కూడా ఆయనే నట. కనీసం అందులో రాజకీయాల గురించి చూపించే ఉద్దేశం లేదట. సాధారణంగానే పోసాని రచనలు రాజకీయాలకు దగ్గరగా ఉంటాయి. కానీ తనకు ఎదురైన పరిణామాలతో రాజకీయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారట. ఈ సినిమా హిట్ కొట్టి మళ్లీ తన సినీ కెరీర్ ను గాడిలో పెట్టుకోవాలని చూస్తున్నారు. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.