Pomegranate Crop Diseases: రక్తహీనతను నివారించడానికి వైద్యులు మందుల కంటే ఎక్కువగా దానిమ్మకాయలు తినాలని చెబుతుంటారు. ఎందుకంటే అందులో ఐరన్ నుంచి మొదలు పెడితే మెగ్నీషియం వరకు లోహాలు ఉంటాయి. వీటివల్ల రక్తహీనత అనేది తగ్గిపోతూ ఉంటుందని వైద్యులు అంటున్నారు. అంతటి గొప్ప పంటను పండిస్తున్న రైతులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి.. పంటను సాగు చేసి.. తీరా ఉత్పత్తి వస్తుందనుకుంటుండగా అన్నదాతలను తెగుళ్లు నట్టేట ముంచుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దానిమ్మ పంటలు ఏపీలోని అనంతపురం పెట్టింది పేరు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాలలో దానిమ్మ పంట విస్తారంగా పండుతూ ఉంటుంది. దానిమ్మ సాగు ద్వారా రైతులకు భారీగానే లాభాలను సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఎందుకంటే దానిమ్మ ఇప్పుడు రైతులకు పంటి కింద రాయి లాగా మారింది. దానిమ్మ తీరా కోతకు వచ్చే క్రమంలో తెగుళ్లు దాడి చేయడంతో రైతులు నిండా మునుగుతున్నారు. ఏం చేయాలో తెలియక కోసిన దానిమ్మకాయలను రోడ్డుమీద పడేస్తున్నారు.
అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం లో దాదాపు 2442 ఎకరాలలో దానిమ్మ సాగవుతోంది. ఎకరానికి రైతులు లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. తీరా కాయలు కాచి.. కోతకు వచ్చే క్రమంలో బ్లైట్ తెగులు ఆశించడంతో దానిమ్మ పంట నాశనం అవుతుంది. కాయలు నల్లగా మారి పగిలిపోతున్నాయి. ఎన్ని రకాలుగా మందులు స్ప్రే చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. దీంతో రైతులు ఆ కాయలను తెంపి బయటపడేస్తున్నారు. చివరికి కోత కూలి కూడా రాకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
ఈసారి దానిమ్మ దిగుబడి బ్రహ్మాండంగా ఉంది. కిలో వచ్చేసి దాదాపు 200 దాకా పలుకుతోంది. అయితే లాభాలు వస్తాయని రైతులు ఆశించినప్పటికీ ఊహించని విధంగా తెగులు సోకి రైతులకు తీవ్ర నష్టాలు మిగులుతున్నాయి.
దానిమ్మలో బ్లైట్ తెగులు అత్యంత ప్రమాదకరమైనది. దీనిని నూనె మచ్చల తెగులు అని కూడా పిలుస్తుంటారు. బ్యాక్టీరియా వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఇది సోకిన తర్వాత ఆకులు.. కాండం.. పండ్లు మొత్తం నూనెతో తడిపినట్టు ఉంటాయి. సకాలంలో గుర్తించకపోతే తోట మొత్తం నాశనం అవుతుంది. ఆకులపై ముందుగా చిన్న పసుపు మచ్చలు ఏర్పడతాయి. అవిక్రమంగా నల్లగా మారి.. ఆకులు రాలిపోతాయి. కొమ్మలు కూడా నల్లబడి ఎండిపోతుంటాయి.. పండ్ల మీద నల్లటి మచ్చలు ఏర్పడి అవి గాయాలుగా మారుతుంటాయి. చివరికి పండ్లు మొత్తం పగిలిపోయి.. కుళ్ళిపోతుంటాయి. తోటల్లో ఎప్పటికప్పుడు శుభ్రతను పాటించాలి.
