AP Police Deptartment : ఏపీ పోలీస్ శాఖలో అసలేం జరుగుతోంది?

రాష్ట్రంలో కింది స్థాయి పోలీసు అధికారులు పదోన్నతులకు నోచుకోకుండా ఓఎస్‌డీల నియామకం జరుపుతున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అయినా జగన్ పెడచెవిన పెడుతున్నారు. తన అస్మదీయులైన పక్క రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ అధికారులను తెచ్చుకొని తన ఇష్టమైన కొలువుల్లో కూర్చోబెడుతున్నారు.

Written By: Dharma, Updated On : May 11, 2023 11:53 am
Follow us on

AP Police Deptartment : ఏపీ సీఎం జగన్ ది విచిత్ర వైఖరి. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి వచ్చిన తరువాత మరోలా వ్యవహరిస్తున్నారు. ఏపీలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉంటూ.. తనకు ఏపీ పోలీస్ పైనే నమ్మకం లేదంటూ ఆరోపణలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ పోలీస్ వ్యవస్థ చాలా గొప్పగా కనిపిస్తోంది. అయితే ఆ శాఖలో పనిచేస్తున్న వారిపై మాత్రం ఆయనకు నమ్మకం కుదరడం లేదు. అందుకే ఉన్న పోలీస్ వ్యవస్థకు సమాంతరంగా మరో వ్యవస్థను తెరపైకి తెస్తున్నారు. ఉన్న అధికారుల అధికారాలను, పరిధులను తగ్గిస్తూ కొత్త అధికారులను నియమిస్తున్నారు.

రిటైర్డ్ అధికారుల నియామకం..
పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలొచ్చేది. శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. లాఅండ్ఆర్డర్ గాడిలో  పెట్టగలరు. కానీఅవి తమకు అక్కర్లేదు అన్న చందంగా జగన్ సర్కారు తయారైంది. ఏకంగా పోలీస్ నియామకాలు, పదోన్నతుల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఎవరికీ తెలియకుండా గుట్టుగా సాగిస్తోంది.ఉన్నత స్థాయిలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ.. ఓఎస్డీల నియామకం పెద్ద ఎత్తున సాగుతోంది.  సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డీజీపీ కార్యాలయంలో ఓ రిటైర్డు అధికారిని నియమించ డంతో పాటు ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో తెలంగాణకు చెందిన ఓ రిటైర్డు అధికారిని ఓఎస్‌డీగా నియమించినట్లు తెలుస్తోంది. పోలీస్ శాఖలో ఇదో హాట్ టాపిక్ గా మారింది.

మితిమీరిన జోక్యం..
పోలీస్ వ్యవస్థపై రాజకీయ జోక్యం సహజం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం మరింత అధికమయ్యింది. అసలు డీజీపీ వ్యవహారశైలిపై జగన్ కు నమ్మకం కుదరడం లేదు. ఆయన పూర్తి స్థాయిలో వైసీపీకి మద్దతుగా లా అండ్ ఆర్డర్ పోలీసుల్ని మరల్చడంలో వైఫల్యం చెందారని అనుకుంటున్నారు. జీవో వన్ ను గట్టిగా అమలు చేయాలని విపక్ష నేతలను రోడ్డెక్కకుండా చేయాలని ఆయన పట్టుబడుతున్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు ఆయన అంచనాలను అందుకోలేకపోతున్నారు. అలాగే.. ఇంటలిజెన్స్ చీఫ్ వ్యవహారంపైనా జగన్ కు అనుమానం వచ్చిందని అంటున్నారు. అన్ని విషయాలు బయటకు తెలుస్తున్నాయని భావిస్తున్నారు. కానీ ఇప్పటికే తమ ప్రభుత్వ చర్యల గుట్టు ఆయన వద్ద ఉండడంతో ఇప్పటికిప్పుడు స్థానచనలం కలిగిస్తే అసలుకే ఎసరు అని భయపడుతున్నారు.

పవర్స్ లో కోత
ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ సమయంలో కఠిన చర్యలకు ఉపక్రమిస్తే అది ఎదురుతిరిగే అవకాశం ఉంది. అందుకే పోలీస్ అధికారుల మార్పు కంటే.. వారి పవర్స్ లో కోత విధించడమే బెటర్ అన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. అందుకే కొత్తగా బయట వ్యక్తులను ఓఎస్డీలుగా నియమిస్తున్నట్లుగా చెబుతున్నారు. డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్‌లకు సంబంధం లేకుండా వారితోనే ఎన్నికలు నిర్వహించుకునేలా.., పూర్తి అధికారాలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖలో సంచలనం అవుతోంది. రాష్ట్రంలో కింది స్థాయి పోలీసు అధికారులు పదోన్నతులకు నోచుకోకుండా ఓఎస్‌డీల నియామకం జరుపుతున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అయినా జగన్ పెడచెవిన పెడుతున్నారు. తన అస్మదీయులైన పక్క రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ అధికారులను తెచ్చుకొని తన ఇష్టమైన కొలువుల్లో కూర్చోబెడుతున్నారు.