Minister Pawan Kalyan: సుదీర్ఘ పోరాటం తర్వాత పొలిటికల్ గా సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్. కూటమి అధికారంలోకి రావడంలో పవన్ పాత్ర కీలకం. గత పది సంవత్సరాలుగా ఎన్నెన్నో అవమానాలు, అడ్డంకులు, అపజయాలు ఎదుర్కొన్నారు పవన్. కానీ వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు. రాజకీయంగా సక్సెస్ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తరువాత పవన్ మంత్రిగా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే పవన్ ప్రమాణం చేసిన సమయంలో వేదికపై ఉన్న చిరంజీవి ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు. ఆనంద భాష్పాలు రాల్చారు.
అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి పవన్ వెంట మెగా కుటుంబం నడిచింది. ప్రజారాజ్యం పార్టీతో ఎన్నో రకాల గుణపాఠాలు నేర్చుకున్న ఆ కుటుంబం.. ఈసారి మాత్రం ఆ తప్పిదం జరగకుండా చూడాలని భావించింది. కూటమి అధికారంలోకి రావాలని బలంగా సంకల్పించింది. అందులో భాగంగానే కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించారు. పిఠాపురంలో పవన్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. మెగా కుటుంబమంతా ప్రచార పర్వంలోకి వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి భార్య సురేఖ, అల్లు అరవింద్ నేరుగా పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. మెగా కుటుంబానికి చెందిన సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, నాగబాబు భార్య.. ఇలా అందరూ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడ్డారు.
ఇప్పటివరకు ఫెయిల్యూర్ నేతగా ఉన్న పవన్.. ఒక్క విజయం దక్కేసరికి జాతీయస్థాయిలో మెరిసిపోయారు. మంచి ఆకర్షణ గల నేతగా అవతరించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కీలక భాగస్వామ్యం అయ్యారు. అయితే ఈ గుర్తింపు ఒకరోజులో రాలేదు. గత పది సంవత్సరాలుగా ఆయన పోరాడుతూనే ఉన్నారు. అదే పోరాటాన్ని గుర్తుచేసుకొని పవన్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. సోదరుడు ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఎమోషన్ అయ్యారు. ప్రస్తుతం ఆ దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.