Pawan Kalyan
Pawan Kalyan: ఏపీలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి ప్రతి జిల్లాలో 10 శాతం ఓటింగ్ నమోదయింది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఇక రాజకీయ ప్రముఖులు కుటుంబ సమేతంగా ఓటు వేశారు. ఈసారి పవన్ కళ్యాణ్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రానికి భార్య అన్నా లెజినోవాతో కలిసి వెళ్లిన పవన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పవన్ దంపతులు వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.
ఓటు వేసిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని పార్టీల శ్రేణులు సహకరించాలని కోరారు. మరోవైపు పవన్ భార్య అన్నా లెజినోవాను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆయనకు మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఓటు ఉంది. ఇప్పటికే మంగళగిరిలో పార్టీ కార్యాలయం తో పాటు శాశ్వత ఇంటి నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటు భార్య మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా నమోదయ్యారు.
కాగా మొన్న ఆ మధ్యన జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్ పవన్ భార్య విషయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మీ మూడో భార్య అన్నా లెజినోవా నీతోనే ఉంటే పిఠాపురంలోని కొత్త ఇంటి పూజా కార్యక్రమాలకు సతీసమేతంగా రండి అంటూ సవాల్ చేశారు. తాజాగా తన భార్యతో కలిసి పవన్ ఓటు హక్కు వినియోగించుకోవడంతో వైసిపి నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. అయితే పవన్ దంపతుల ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పోతిన మహేష్ లాంటి వారికి ఈ ఫోటోలు, వీడియోలు చెంపపెట్టు అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.