Deputy CM Pavan Kalyan : పవన్ వచ్చాడు.. ఒక గొప్ప మార్పు తెచ్చాడు..

స్థానిక సంస్థలకు ఒక అపురూపరమైన వరం. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాజకీయాలకు అతీతంగా నేతలు ఒకే తాటి పైకి రావాల్సిన అవసరం ఏర్పడింది. డిప్యూటీ సీఎం పవన్ మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామసభలను ఏర్పాటు చేశారు. వాటిని సద్వినియోగం చేసుకుంటే గ్రామాలు అభివృద్ధి సాధించినట్టే.

Written By: Dharma, Updated On : August 23, 2024 1:12 pm

Gramasabhas In AP

Follow us on

Deputy CM Pavan Kalyan : ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో గ్రామసభలు జరుగుతున్నాయి. తమ గ్రామాలకు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఈ గ్రామసభల ద్వారా గుర్తించారు.కాలువలు,రహదారులు,మరుగుదొడ్లు..ఇలా ప్రజలకు అవసరమైన పనులను ప్రతిపాదించారు.వాటికి ఆమోదం తెలిపారు. అయితే ఈ తరహా ప్రక్రియ జరగడం ఇదే మొదటిసారి. దశాబ్దాల కిందట ఈ వ్యవస్థ ఉండేది. గ్రామం మధ్యలో గ్రామ సభ ఏర్పాటు చేసేవారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేవారు. ప్రజలకు ఏం అవసరమో గుర్తించేవారు.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. పంచాయితీల స్థానంలో సచివాలయాలు వచ్చాయి. ప్రభుత్వ సిబ్బంది స్థానంలో వాలంటీర్లు వచ్చారు. ఆ రెండు వ్యవస్థలతో పంచాయితీ వ్యవస్థ ఉత్సవ విగ్రహంగా మారింది. సర్పంచులు సైతం ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యారు. అయితే దాని నుంచి పంచాయితీలను, సర్పంచులను బయటపడేసేందుకు రంగంలోకి దిగారు డిప్యూటీ సీఎం పవన్. పాత పంచాయతీ విధానాన్ని తెరపైకి తెచ్చి వాటికి పూర్వ వైభవం తేవాలని భావించారు. అందుకే గ్రామసభల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు.

* అప్పుడు నిధులు పుష్కలంగా
గతంలో ప్రజలు పన్నుల ద్వారా కట్టిన సొమ్ము స్థానిక సంస్థలకే జమ అయ్యేది. రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిధులను అందించేది. గ్రామ జనాభాను అనుసరించి మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సంఘం నిధులు కేటాయించేది.ప్రజలు ఉమ్మడిగా గ్రామసభ ఏర్పాటు చేసుకుని.. ఫలానా పని చేస్తే గ్రామానికి సౌకర్యంగా ఉంటుందని ఒక తీర్మానం చేసుకునేవారు. దాని ప్రాప్తికి పనులు చేపట్టేవారు. ప్రజలకు కూడా ఎంతో ఉపయోగంగా ఉండేది.

* పవన్ నమ్మకం అదే
పల్లె సీమల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని పవన్ నమ్ముతూ వచ్చారు.అందుకే విపక్షంలో ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధిపైనే ఎక్కువగా మాట్లాడే వారు. వైసిపి ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడానికి తప్పు పట్టేవారు. పంచాయితీ వ్యవస్థ నాశనం కావడానికి సచివాలయ వ్యవస్థ కారణమని.. వాలంటీర్ వ్యవస్థతో ప్రమాదమని పవన్ హెచ్చరించారు. ఈ విషయంలోనే గట్టిగానే పోరాడారు. తాము అధికారంలోకి వస్తే పల్లెలను అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పుకొచ్చారు.

* మంచి అవకాశం
పవన్ చెప్పినట్టు మాదిరిగానే పల్లెలపై దృష్టి పెట్టారు. ఏకంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఇప్పటివరకు పంచాయతీలకు ఇస్తున్న నిధులను.. 100 శాతానికి పెంచుతూ కేటాయించారు. ఇప్పుడు గ్రామసభల ద్వారా పనులను గుర్తించి నిధులు కేటాయించేందుకు సిద్ధపడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక సంస్థల ప్రతినిధులు, స్థానిక నేతలు వ్యవహరిస్తే.. గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదే జరిగితే పవన్ పేరు చిరస్థాయిగా నిలిచే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం మరోసారి సచివాలయ వ్యవస్థను ఆశ్రయించాల్సి ఉంటుంది.