Kadambari Jethwani: పెళ్లి, ఫోర్జరీ డాక్యుమెంట్లు.. ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ.. కాదంబరి పై వేధింపుల కేసులో సరికొత్త సంచలనాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముంబై నటి కాదంబరి ఉదంతం సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వంలో పని చేసిన పోలీసు అధికారులు కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.. అంతేకాదు మీడియా సమక్షంలో కాదంబరి అనేక విషయాలను వెల్లడించడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Written By: Dharma, Updated On : August 31, 2024 3:06 pm

Kadambari Jethwani(3)

Follow us on

Kadambari Jethwani: “నాపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసును విచారించేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని నన్ను ఇబ్బంది పెట్టారు. తీవ్రంగా వేధించారు. ఈ జాబితాలో మరో ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారు. అయితే వారి పేర్లు నాకు తెలియదు. కొంతమంది పోలీసులైతే నన్ను అసభ్యకర రీతిలో ఫోటోలు తీశారు. వీడియోలు చిత్రీకరించారని” కాదంబరి శుక్రవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలివి. అయితే ఈ వ్యవహారంలో విద్యాసాగర్ కాదంబరిని పెళ్లి చేసుకుంటానని అన్నాడట. దానికి నిరాకరించడంతోనే వేధింపులకు గురి చేశాడని కాదంబరి చెబుతోంది. పైగా తనను ముంబై నగరంలో కిడ్నాప్ చేశారని.. ఈ వ్యవహారంలో 15 మంది ఏపీ పోలీసు అధికారులు పాల్గొన్నారని ఆమె ఆరోపిస్తోంది..”విద్యాసాగర్ 2015 లో నా ఎదుట పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే ఆయనకు అనేక వివాహేతర సంబంధాలు ఉండడం వల్ల నేను ఒప్పుకోలేదు. అప్పటినుంచి నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. మానసికంగా వేదింపులకు గురి చేస్తున్నాడు. నన్ను ఏకంగా ముంబై లో ఏపీ పోలీసులతో అరెస్టు చేయించాడు.. నన్ను అప్పటి విజయవాడ సి పి కాంతి రాణా టాటా అక్రమ కేసుల్లో ఇరికించాడు. నా జీవితాన్ని 40 ఐదు రోజులపాటు దుర్భరం చేశారు. నా తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతిన్నది. జైల్లో ఉండగా నా తండ్రి బంగారు ఉంగరాన్ని దొంగిలించారు. ఒక మహిళనని చూడకుండా నన్ను హింసించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఇబ్బంది పెట్టారు. ఈ డాక్యుమెంట్ల సృష్టికర్త కూడా విద్యాసాగరే. నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారనే ఆధారాలను పోలీసులకు ఇచ్చాను. ఆ డాక్యుమెంట్లో విద్యాసాగర్ పేర్కొన్న ఆస్తి ఇప్పటికే బ్యాంకుకు కుదువ పెట్టారు. అలాంటి ఆస్తిని నేను ఇతర వ్యక్తులకు ఎలా విక్రయిస్తాను? ఒకవేళ నేను పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే వారు నాపై కేసులు పెట్టేవారు కదా” అని కాదంబరి వ్యాఖ్యానించింది.

సంచలన విషయాలు

మరోవైపు కాదంబరి ని విజయవాడ తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్ లో ఉంచిన సమయంలో ఐపీఎస్ అధికారులు వీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని అక్కడికి వచ్చారట. ఆ తర్వాత కాదంబరి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేసారట. పోలీసులు ఆమె ఫోన్లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారట. వాటిని కోర్టు ద్వారా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాల్సి ఉన్నప్పటికీ.. అలా చేయలేదట. కుక్కల విద్యాసాగర్ పోలీసుల ఎదుట ప్రవేశపెట్టిన డాక్యుమెంటును కూడా పంపించలేదట. అంతేకాదు ఈ కేసును విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేశారట. ఆ బృందంలో అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ, సీఐ శ్రీధర్, దుర్గ భవాని, మౌనిక, రమేష్ బాబు, షేక్ అబ్దుల్ రెహమాన్, భాను కిరణ్, గోపి, షేక్ షబ్నా, గీతాంజలి, రమ్య అనే పోలీసు అధికారులు ఉన్నారు. కాదంబరి కుటుంబాన్ని ఇబ్రహీంపట్నం తీసుకొచ్చిన తర్వాత మరో 10 మంది పోలీసులు ఈ కేసు విచారణలో భాగస్వాములు అయ్యారట.. అయితే ఈ కేసులో ఇంతమంది పోలీసులను ఇన్వాల్వ్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు ఈ కేసులో కాదంబరి కుటుంబానికి బెయిల్ దొరకకుండా నాటి పోలీసులు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆమె తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అంటున్నారు.