Nara Lokesh Steel Plant Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలో( Anakapalli district ) మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దాదాపు లక్ష 30 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మితం కానుంది ఈ స్టీల్ ప్లాంట్. దాదాపు లక్ష మంది వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. 5 వేలకు పైగా ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ స్టీల్ ప్లాంట్ ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. మరోవైపు ఈ స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు కావడం వెనుక ఉన్న కారణాలను మంత్రి నారా లోకేష్ వివరించారు. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి రావడం వెనుక 2024 లో జూమ్ కాల్ కారణం అంటూ చెప్పుకొచ్చారు. 2019లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ కోసం ప్రయత్నాలు జరిగాయని.. కానీ అందుకు తగ్గ ప్రయత్నాలు 2024లో విజయవంతం అయ్యాయి అంటూ మంత్రి నారా లోకేష్ వివరించే ప్రయత్నం చేశారు.
* పెద్దగా ఆసక్తి చూపని వైనం..
2014లో నవ్యాంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అయితే కొద్ది రోజులకే రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి నారా లోకేష్ చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో 2019లో దావోస్ పర్యటనకు ఆయన వెళ్లారట. అప్పుడే అర్సలార్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్ ను కలిసేందుకు ప్రయత్నించారట. కానీ ఆ సమయంలో కుదరలేదు. ఆ తరువాత ఆయన్ను కలిసి అవకాశం వచ్చింది. ఆదిత్యను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరానని.. ఆయన మాత్రం పాము వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చూస్తున్నామని తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ ఆ ప్రయత్నాలు జరగకపోతే ఏపీ పెట్టుబడుల కోసం సిద్ధంగా ఉందని ఆరోజు ఆదిత్య కు చెప్పినట్లు గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆదిత్య మిట్టల్ తో మాట్లాడిన ఓ జూమ్ కాల్ ఏపీ భవిష్యత్తును మార్చేసిందని చెప్పారు.
* జూమ్ కాల్ తో చర్చలు..
లోకేష్ చెప్పిన వివరాలు ప్రకారం.. 2024 సెప్టెంబర్ 22న రాత్రి ఆదిత్య మిట్టల్ తో తాను అరగంట పాటు జూమ్ కాల్ లో మాట్లాడిన విషయాన్ని మంత్రి లోకేష్ బయటపెట్టారు. ఆరోజు చర్చల ఫలితంగానే దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రాక నిదర్శనం అన్నారు. ఆదిత్య మిట్టల్ తో మాట్లాడిన తర్వాత రెండు నెలలకి ఏపీ ప్రభుత్వం నుంచి స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ప్రోత్సాహకాలు అందించామని చెప్పారు. మూడు నెలల్లో పరిశ్రమకు అవసరమైన భూమితో పాటు పర్యావరణ, అటవీ అనుమతులు కూడా ఇప్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ అనుమతులు విషయంలో ఇబ్బందికర పరిస్థితులు రాగా సీఎం చంద్రబాబు స్వయంగా కలుగజేసుకున్నారని.. ప్రధానమంత్రి కార్యాలయం తో సంప్రదింపులు జరిపి స్టీల్ ప్లాంట్ కు ఉన్న అన్ని అడ్డంకులు తొలగించిన వైనాన్ని వివరించారు లోకేష్.
