Chandrababu Modi
Chandrababu Modi: ప్రధాని మోదీ నామినేషన్ కు టిడిపి అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. మోడీ వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమానికి హాజరుకావాలని చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించారు మోడీ. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరి దశలో వారణాసి ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే మోడీ నామినేషన్ వేయనున్నారు. 13న ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత చంద్రబాబు పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. రోజంతా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయనున్నారు. 14న ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్ళనున్నారు. మోదీ నామినేషన్ అనంతరం విజయవాడ రానున్నారు.
అయిష్టంగానే బిజెపి అగ్రనేతలు తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు అన్నది వైసిపి చేస్తున్న ప్రచారం. ఒకవైపు తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు ఉన్నా.. జగన్ అంటే మోడీకి ఇష్టమని.. వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ వచ్చాయి. టిడిపి తో బీజేపీ పొత్తు పెట్టుకున్నా, బిజెపి అగ్ర నేతల నుంచి విమర్శలు వచ్చినా.. జగన్ మాత్రం వారిని పలెత్తు మాట అనడం లేదు. పైగా ఎన్నికల తరువాత తమ మద్దతు బిజెపికి ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. అయితే వీటిని బిజెపి అగ్ర నేతలు కనీస పరిగణలోకి తీసుకోలేదు. ఎన్నికల ప్రచారంలో జగన్ అసమర్థత, వైసిపి పాలనపై ఏకిపారేశారు. ఒక రాష్ట్రానికి సీఎం కాబట్టి గౌరవించామని.. ఆయనపై ఎలాంటి అభిమానం లేదని ప్రధాని మోదీ ఇటీవల టీవీ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. దీంతో వైసిపి శ్రేణుల ప్రచారానికి తెరపడింది.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పెట్టుకున్నా బిజెపి ఆగ్రనేతల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందదని వైసిపి భావించింది. ఎన్నికల నిర్వహణపరంగా వైసీపీకే సపోర్ట్ చేస్తారని అంచనా వేశారు. కానీ బిజెపి అగ్రనేతలు జలక్ ఇచ్చారు. రాష్ట్ర డిజిపి తో పాటు చాలామంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేశారు. ఎన్నికల పోలింగ్కు ముందు కూడా చాలామంది సిఐలపై చర్యలకు ఉపక్రమించారు. నేరుగా బిజెపి అగ్ర నేతలు ఏపీకి వచ్చి వైసీపీతో తమకు ఎటువంటి సంబంధాలు లేవని.. వచ్చేది కూటమి ప్రభుత్వమని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాజిటివ్ వైబ్రేషన్ ప్రారంభమైంది. దీంతో వైసిపి లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
మరోవైపు కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ తరుణంలో చంద్రబాబుకు బిజెపి ప్రాధాన్యత ఇవ్వడం వైసిపి లో వణుకు పుట్టిస్తోంది. చంద్రబాబుకు మోడీ ప్రత్యేకంగా ఆహ్వానం పలకడంతో ఆయన పలుకుబడి పెరిగినట్లు టిడిపి ప్రచారం చేసుకుంటుంది. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందికర పరిణామాలు తప్పవని వైసీపీ శ్రేణులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని చివరి వరకు వైసిపి శ్రేణులు ప్రయత్నించాయి. కానీ కూటమికి అనుకూల పవనాలు వీస్తుండడంతో.. ఒక రకమైన అంతర్మధనం వైసీపీలో కనిపిస్తోంది.