Mangalagiri SI
Mangalagiri SI: రాష్ట్రంలో డిజిపి నుంచి కిందిస్థాయి ఎస్సై వరకు బదిలీల వేటు పడుతోంది. కొంతమంది అయితే సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే వీరంతా అధికార పార్టీకి కొమ్ము కాశారనో.. విపక్షాలపై దూకుడు ప్రదర్శించారనో అభియోగాలు మోపి తప్పించారు. అయితే విచిత్రంగా మంగళగిరిలో పనిచేస్తున్న ఎస్సై మరో కారణంతో సస్పెన్షన్ కు గురయ్యారు. తన ఓటును 5 వేలకు అమ్ముకోవడంతో అడ్డంగా బుక్కయ్యారు.వేటుకు గురయ్యారు.
మంగళగిరి ఎస్సై స్వస్థలం ప్రకాశం జిల్లా. విధి నిర్వహణలో భాగంగా ఆయన పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. ఈ క్రమంలో అక్కడ అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేశారు. ఉద్యోగులకు ప్రలోభాలు పెట్టారు. అందులో భాగంగా మంగళగిరి ఎస్సై ని ఆశ్రయించారు. ఓటుకు 5000 రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారు.దీంతో ఎస్సై తన ఓటును వైసీపీకి అనుకూలంగా వేశారు. ఆ నగదును ఎస్ఐ బంధువులకు ఇవ్వడంతో వారు.. ఎస్సై కి ఫోన్ పే చేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రలోభాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. విచారణకు ఆదేశించింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొనుగోలు చేసిన ఒక ముఠాను ప్రకాశం జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముఠా సభ్యులు ఇచ్చిన జాబితాలో మంగళగిరి ఎస్సై పేరు కూడా ఉంది. దీంతో ఎస్సై పై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు ప్రలోభాలకు లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో పోలీస్ సిబ్బంది, అధికారుల సైతం ఉండడం ఆశ్చర్యం వేస్తోంది. అయితే అనూహ్యంగా మంగళగిరి ఎస్సై మాత్రం దొరికిపోవడం సంచలనంగా మారింది.