Maha Lakshmi Scheme: తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మొదట యూనిఫాం స్టిచ్చింగ్ పనులు అప్పగించారు. తర్వాత ఇందిరా మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయించారు. తర్వాత ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే అమలవుతోంది. తాజాగా రుణాల వడ్డీ డబ్బులు ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడ మళ్లీ ఒక్కో మహిళ ఖాతాలో రూ.2,500 జమ చేయబోతున్నారు.
మహాలక్ష్మిలో పథకంలో భాగమే…
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా 18–55 ఏళ్ల మహిళలకు నెలవారీ రూ.2,500 ఆర్థిక సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఉద్దేశం. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం ద్వారా ఈ పథకం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మద్దతు అందించనుంది.
Also Read: Jagan Press Meet Highlights: 3 ఏళ్లలో టీడీపీని దించి అధికారంలోకి.. అసలు జగన్ ధీమా ఏంటి?
స్థానిక ఎన్నికలకు ముందే..
పథకం అమలుకు సంబంధించి ఉన్నతాధికారులు సెర్ప్, మెప్మా నుంచి మహిళల వివరాలను సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను సులభతరం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఆర్థిక సాయం మహిళా ఓటర్ల మద్దతును ఆకర్షించే అవకాశం ఉంది.
అర్హుల ఎంపిక సవాలే..
పథకం అమలులో పారదర్శకత, సమర్థవంతంగా లబ్ధిదారుల ఎంపిక, నిధుల పంపిణీ కీలకం. లబ్ధిదారుల ఎంపికలో లోటుపాట్లు లేదా రాజకీయ జోక్యం వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే సమయంలో, ఈ పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల సామాజిక–ఆర్థిక స్థితిని మెరుగుపరిచే అవకాశాన్ని కల్పిస్తుంది.