Kodali Nani political comeback: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీలో మాజీమంత్రి కొడాలి నాని తిరిగి యాక్టివయ్యారు. తన సొంత నియోజకవర్గం గుడివాడలో ఇప్పుడు వరుస పర్యటనలు చేస్తున్నారు. మొన్నటివరకు ఆయన అనారోగ్యంతో బాధపడ్డారు. కానీ ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకొని నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కొడాలి నాని పొలిటికల్ కామెంట్స్ మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎం కావడం ఖాయం అని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. అయితే కొడాలి నాని అన్నింటికీ సిద్ధపడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోంది. కొద్ది రోజుల కిందట ఆయన తన అరెస్ట్ పై మాట్లాడారు. మహా అయితే ఓ 100 రోజులు ఉంచుతారు. అంతకంటే ఏం చేయగలరు అని ప్రశ్నించడం ద్వారా తాను అన్నింటికీ సిద్ధమని సంకేతాలు పంపారు. అయితే తర్వాత కనిపించకుండా మానేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మరోసారి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు కొడాలి నాని.
అరెస్టుపై అనుమానాలు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి శ్రేణులే కాదు సామాన్య ప్రజలు సైతం కొడాలి నాని విషయంలో ఏం జరుగుతుంది అని ఆలోచించారు. కొడాలి నాని అరెస్టు తప్పకుండా జరుగుతుందని అంచనా వేశారు. అయితే ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. హైదరాబాదులో విశ్రాంతి తీసుకుని.. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పాత ధోరణితో, బూతు మాటలతో వ్యాఖ్యలు చేయకపోయినా.. కూటమిని మాత్రం స్ట్రాంగ్ గా విమర్శిస్తున్నారు. అయితే జైలు జీవితం తప్పదు అని ఆయన ఒక డెసిషన్ కు వచ్చినట్టు ఉన్నారు. మరోవైపు కొడాలి నాని విషయంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని రకాల హెచ్చరికలతోనే ఆయన మళ్లీ క్రియాశీలకం అయినట్లు ప్రచారం నడుస్తోంది.
ప్రత్యామ్నాయ నేత కోసం
గత రెండు సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అక్కడ పార్టీ నేతలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు వెళ్లిపోయారు. ఈ తరుణంలో అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారట. అయితే విశ్రాంతి తీసుకునేందుకు కొడాలి నాని మరికొంత సమయం కూడా అడిగారని తెలుస్తోంది. కానీ ఇప్పటికే సమయం మించిపోయిందని.. ఇప్పటినుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహించకుంటే అక్కడ వెనుకబాటు ఖాయమని జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అందుకే కొడాలి నాని గత్యంతరం లేక రంగంలోకి దిగినట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే అక్కడ లోకల్ ఎమ్మెల్యే దూకుడుగా ఉన్నారు. ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. జగన్ హెచ్చరించడంతోనే కొడాలి నాని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో చూడాలి.