Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు అన్న టాక్ నడుస్తోంది.. ముందుగా ఇప్పుడు ఆయనతో రాజీనామా చేయించి.. జగన్మోహన్ రెడ్డి ఉపఎన్నికకు వెళ్తారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తన చుట్టూ ఉన్న కేసుల దృష్ట్యా.. ఢిల్లీలో ఉంటేనే తన ప్రయత్నాలు అన్నట్టు జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డికి ఈడి నోటీసులు ఇస్తుంది అన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్ చుట్టూ ఉచ్చు బిగిసినట్టే. అది జగన్మోహన్ రెడ్డికి సైతం తెలుసు. అందుకే ఇప్పుడు కేంద్ర పెద్దలను కలవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అది ఎంత మాత్రం వర్కౌట్ కావడం లేదు. అందుకే జగన్ ఆలోచనలో పడ్డారు. మున్ముందు తన అక్రమాస్తుల కేసులు బయటకు వస్తే ఎలా అడుగులు వేయాలి అనే దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
* ఢిల్లీలో అడుగు పెట్టాలని..
ప్రస్తుతం కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైసిపి ఏర్పాటు చేసినప్పుడు అదే కడప నుంచి ఎంపీగా గెలిచారు జగన్. నిత్యం ఢిల్లీలో ఉంటూ లాబీయింగ్ చేసుకొని.. తన కేసుల విషయంలో బెయిల్ వచ్చేలా చేసుకున్నారు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంతో స్నేహం చేసేందుకు తన ఎంపీ పదవి ఆయనకు కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పాత కేసులన్నీ తెరమీదకు రానున్నాయి. గత పుష్కర కాలానికి పైగా జగన్ బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు గాని ఆ బెయిల్ రద్దు అయితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్ కు తెలుసు. అందుకే ఢిల్లీలో లాబీయింగ్ చేసేందుకు గాను ఇప్పుడు ఎంపీ పదవిని ఆయన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని రాజీనామా చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంతో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగింది. సొంత కుటుంబమే తన తండ్రిని చంపిందని సునీత ఆరోపించారు. చంపిన వారికి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉందంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇవి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎంతగానో నష్టం చేకూర్చాయి. మొన్నటి ఎన్నికల్లో కడపలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే. అందుకే మరోసారి అవినాష్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తే ప్రతికూల ఫలితం వస్తుందన్న ఆందోళన జగన్లో ఉంది. అందుకే ఈసారి అవినాష్ రెడ్డిని పోటీ నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఒక ఫార్ములా తో ముందుకు వెళుతున్నారు. అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. బైపోల్స్ వస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అలా ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దలతో లాబీయింగ్ చేసుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది.
*భారతి తో పోటీ..
2029 సార్వత్రిక ఎన్నికల నాటికి తిరిగి జగన్ పులివెందుల నుంచి.. కడప పార్లమెంట్ స్థానం నుంచి అవినాష్ రెడ్డికి కాకుండా తన భార్య భారతి రెడ్డిని రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. భారతీ అయితేనే తట్టుకోగలరు అనేది ఒక అంచనా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల మరోసారి పోటీ చేసే ఛాన్స్ ఉంది. కూటమి బలంగా ఉంది. అవినాష్ రెడ్డి అయితే మరోసారి వివేకానంద రెడ్డి హత్య అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇన్ని ప్రమాదాల నడుమ తన భార్యను రంగంలోకి దించి.. అవినాష్ రెడ్డి ని పక్కన పెడతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.



