Arava Sridhar Resignation: జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి.. తన పదవిని వదులుకున్నారు. రాజీనామా పత్రాన్ని అధినేత పవన్ కళ్యాణ్ కు సమర్పించారు. కొద్ది రోజుల కిందట ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగి అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వీడియోలతో పాటు ఆడియో సంభాషణలను సైతం బయటపెట్టింది. అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. అయితే ఆమె ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రోజురోజుకు పరిస్థితి తీవ్రం కావడంతో విచారణ కమిటీని నియమించారు పవన్ కళ్యాణ్. అయితే ఆ కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో తెలియదు కానీ.. నిన్ననే అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఈ అంశంపై చర్చించారు అరవ శ్రీధర్.
* రైల్వే కోడూరు నుంచి గెలుపు..
మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున రైల్వే కోడూరు నుంచి గెలిచారు అరవ శ్రీధర్. గెలిచిన కొద్ది కాలానికి ఆయనపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఓ మహిళా ఉద్యోగి ఏకంగా ఆయనతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయట పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని ఒక విమర్శన అస్త్రంగా మార్చుకుంది. సోషల్ మీడియాలో సైతం అరవ శ్రీధర్ను టార్గెట్ చేసుకుంది. ఈ పరిణామాల క్రమంలో విచారణ కోసం జనసేన తరఫున ముగ్గురు నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి కీలక ఆధారాలు ఇచ్చారు అరవ శ్రీధర్. ఆమె ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ను బయటపెట్టారు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మొన్న మధ్యన జనసేన నేతలు ఆమెపై దాడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో జనసేన పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
* అధినేత పవన్ కు సమర్పణ..
నిన్ననే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసారు అరవ శ్రీధర్. ఆ మహిళతో తనకు వ్యక్తిగత సంబంధాలు గతం నుంచి ఉన్నాయని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బ్లాక్ మెయిల్ చేశారని.. అందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను అధినేతకు సమర్పించారు. అయితే పవన్ సూచన మేరకు ఆరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారు. తనపై ఆరోపణలు వచ్చిన క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన అధికారిక పదవి తన వద్ద ఉంచుకోవడం సహేతుకం కాదని.. అందుకే రాజీనామా చేసినట్లు అరవ శ్రీధర్ మీడియాకు తెలిపారు. అధినేతకు అన్ని వివరించానని.. తాను ఎటువంటి తప్పులు చేయలేదని చెప్పుకొచ్చారు. ఇటీవలే పార్టీ క్రియాశీలక సమావేశంలో నేతల వ్యక్తిగత తప్పిదాలు పార్టీకి మైనస్ చేస్తే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. ఇప్పుడు నేరుగా అరవ శ్రీధర్ వచ్చి తన పదవికి రాజీనామా చేయడం విశేషం.
