YS Jagan : ఎంతైనా రక్తసంబంధం రక్తసంబంధమే. కొన్ని విషయాల్లో విభేదిస్తాం కానీ.. ఎక్కడో మూల తమ వారే కదా అన్న భావన ఉంటుంది. ఇప్పుడు జగన్ లో అది కనిపిస్తోంది. తనను రాజకీయంగా విభేదించి, తనను టార్గెట్ చేస్తున్న షర్మిలపై జగన్ సానుభూతి చూపిస్తున్నారు. మొన్న ఆ మధ్యన ఆమె ధరించిన చీర పై మాట్లాడిన జగన్.. తాజాగా కాస్త వెనక్కి తగ్గి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ లో సడన్ చేంజ్ పై రకరకాల చర్చ నడుస్తోంది. అయితే షర్మిలపై సానుభూతి చూపుతూనే జగన్ సెటైరికల్ గా మాట్లాడడం గమనార్హం.
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జగన్ నేషనల్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అక్రమ కేసుల చార్జి షీట్లలో వైయస్ రాజశేఖర్ రెడ్డితో పాటు తన పేరు చేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఇందులో చంద్రబాబు కూడా పాపం ఉందని విమర్శించారు. ప్రస్తుతం షర్మిల తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నారని.. ఆయనే అంతా నడిపిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తన సోదరి షర్మిల కాంగ్రెస్ వైపు వెళ్లడం బాధగా ఉందని చెప్పుకొచ్చారు జగన్. అన్నింటికంటే మించి ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని.. అదే తనకు బాధగా ఉందని జగన్ చెప్పడం విశేషం. కడప పార్లమెంట్ స్థానంలో షర్మిలకు డిపాజిట్లు రావని కూడా జగన్ తేల్చడం సంచలనం గా మారింది. ఇప్పటికే అక్కడ షర్మిల పట్టు బిగిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ ఈ తరహా ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే జగన్ వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేశారా? లేకుంటే జాతీయస్థాయిలో షర్మిలను పలుచన చేయడానికి చేశారా? లేకుంటే వారి వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పడం ద్వారా.. బిజెపి అగ్ర నేతలకు సమాచారం అందించారా? అన్నది తెలియాల్సి ఉంది.