Jagan Delhi Tour : కష్టం వచ్చిన ప్రతిసారి ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళుతుంటారని ఒక నానుడి ఉంది. ఏ సీఎం అయినా రాష్ట్రాభివృద్ధి కోసం హస్తినా బాట పట్టడం ఆనవాయితీ. కానీ జగన్ మాత్రం అప్పుల అనుమతుల కోసం వెళుతుంటారని ఒక విమర్శ ఉంది. గత నాలుగేళ్లుగా ప్రతినెలా జగన్ ఢిల్లీ బాట పడుతుండడం రివాజుగా మారింది. అయితే జూన్ నెలాఖరులో వెళ్లాలని ప్రయత్నించినా వీలుకాలేదు. కానీ ఈ నెల మొదటి వారంలో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసేందుకు అపాయింట్ మెంట్ దొరికినట్టు తెలుస్తోంది.
గత నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినా అవి ఏ మూలకు సరిపోవడం లేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. అమ్మఒడికి బటన్ నొక్కారు. కానీ ఐదు రోజులు గడుస్తున్నా తల్లుల ఖాతాల్లో నిధులు జమకాలేదు. ఉద్యోగుల జీతాలు సైతం చెల్లించలేదు. పదో తేదీ గడిస్తే కానీ పూర్తిస్థాయిలో జీతాలు చెల్లింపులు జరిగేలా లేవు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పుల పరిమితి ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలలతో ముగిసిపోయింది. ఎన్నికల ముంగిట అప్పుపుట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశముంది.
రాజకీయంగా కూడా ఏమంతా పరిస్థితి బాగాలేదు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైనట్టు తెలుస్తోంది. వాటికి బీజేపీ తోడైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశముంది. బీజేపీ సహాయ నిరాకరణ చేస్తే గతంలో చంద్రబాబు ఎదుర్కొన్న పరిస్థితులే ఎదురయ్యే అవకాశముంది. ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఆపసోపాలు పడే చాన్స్ ఉంది. అందుకే టీడీపీ, జనసేన వైపు వెళ్లకుండా బీజేపీ పెద్దలను విన్నవించే అవకాశముంది. ఎంపీ సీట్లు ఎక్కువగా వైసీపీకి వచ్చే అవకాశమున్నందని.. అవసరమైన పక్షంలో ఎన్డీఏకు వెన్నుదన్నుగా ఉంటానని జగన్ హామీ ఇచ్చే అవకాశముంది.
మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడును నియంత్రించాలని జగన్ కోరే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది. అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ పై ఈ నెల 3న విచారణ జరనున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పెద్దలను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ ఢిల్లీ వెళుతున్నది సొంత ప్రయోజనాలకు తప్ప.. రాష్ట్రాభివృద్ధికి కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఈ నెల 5న జగన్ ఢిల్లీ టూర్ మారిన తరువాత ఏపీలో రాజకీయ సమీకరణలు మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.