Jagan Sharmila family dispute: వైఎస్ కుటుంబంలో ఆర్థిక చిచ్చు ఇప్పట్లో తగ్గేలా లేదు. వైయస్ కుటుంబ ఆస్తుల వివాదంలో తల్లి విజయమ్మ( YS vijayamma ) తాజాగా వేసిన అఫిడవిట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. తన సొంత కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తన మనవలైన షర్మిల పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడంటూ ఆమె నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఆఫిడవిట్ దాఖలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంతవరకు ఆస్తుల పంపకం జరగలేదని.. ఉన్నవన్నీ ఉమ్మడి కుటుంబ ఆస్తులేనని ఆమె తేల్చి చెప్పారు. తన నలుగురు మనవలు, మనవరాళ్లకు ఆస్తులను సమానంగా పంచాలన్నదే రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరికగా, ఆజ్ఞగా ఆమె గుర్తు చేశారు.
గత కొంతకాలంగా వివాదం..
గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సరస్వతి సిమెంట్స్( Saraswati Cements ) షేర్లతో పాటు ఇతర ఆస్తుల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయమ్మ తన కుమార్తె షర్మిలకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. తన తల్లి షేర్ ను చెల్లెలు షర్మిల దక్కించుకోవడంపై పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొద్దిరోజులుగా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయమ్మ అఫీడవిట్ దాఖలు చేశారు. జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి దక్కాల్సిన వాటాలు ఇవ్వకుండా మోసం చేయడం పై విజయమ్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరస్వతి సిమెంట్స్ షేర్లతో పాటు యలహంక ఇల్లు కూడా షర్మిల దేనని.. ఇది వైయస్సార్ స్వయంగా ఇచ్చిన ఆదేశమని ఆమె స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కారణాలతో లేదా ఇతర విభేదాలతో తన చెల్లెలి పిల్లలకు రావాల్సిన ఆస్తులను జగన్ అడ్డుకోవడం ధర్మం కాదని ఆమె ఆ ప్రత్యేక న్యాయస్థానానికి పేర్కొన్నారు. షర్మిల అడుగుతోంది కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమెకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటాయే తప్ప.. జగన్ ఇచ్చే బహుమతి కాదని కూడా తేల్చి చెప్పారు.
Also Read: ఏపీ రాజకీయాల్లోకి మరో యువ నటుడు!
బినామీ ఆరోపణపై ఆవేదన…
మరోవైపు షర్మిలకు( Y S Sharmila ) తనను బినామీగా జగన్మోహన్ రెడ్డి పేర్కొనడాన్ని ఇప్పటికే విజయమ్మ తప్పు పట్టారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేవుడిపై ప్రమాణం వేసి తాను అన్ని నిజాలు చెబుతున్నానని.. షర్మిల ఆస్తుల కోసం పాకులాడుతోందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకొని తన మేనల్లుడు, మేనకోడలికి న్యాయం చేస్తాడని ఒక తల్లిగా ఆశిస్తున్నట్లు తన ఆఫిడవిట్ లో పేర్కొంటూ బాధపడ్డారు. ప్రస్తుతం విజయమ్మ వాదనలు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
