Jagan: రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు తో పాటు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పై దాడి జరిగింది. మరోవైపు అంబటి రాంబాబు అరెస్టుతో పాటు.. ఇద్దరు నేతల ఇళ్లపై దాడులకు సంబంధించిన పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అంబటి రాంబాబు. మరోవైపు జోగి రమేష్ బెయిల్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధంగా సిఐడి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ఘటనల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈరోజు గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిని పరిశీలించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
* గత అనుభవాల దృష్ట్యా..
గతంలో పార్టీ నేతల పరామర్శలకు వెళ్ళినప్పుడు రకరకాల ఘటనలు జరిగాయి. ఇప్పుడు మరోసారి జగన్మోహన్ రెడ్డి అదే మాదిరిగా బలప్రదర్శనతో వెళుతుండడం మాత్రం పోలీసులకు ఇబ్బందికరంగా మారుతోంది. అయితే మరోసారి భారీ జన సమీకరణ నడుమ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన సాగుతోంది. దీనిని ఒక బల ప్రదర్శన గా చేపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులు అదుపుతప్పిలా ఉన్నాయి. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇలా బలప్రదర్శనలు దిగడం ఏంటనేది కూటమినేతల వాదన. కచ్చితంగా విధ్వంసాలు సృష్టించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలే తప్ప.. ఇదేంటి పరిస్థితి అని సోషల్ మీడియాలో సైతం ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నో రకాల సమస్యలు ఉండగా.. కేవలం వైసీపీ నేతల పరామర్శలకు, వారి ఇంట్లో జరిగే కార్యక్రమాలకు జగన్ హాజరవుతున్నారని సెటైర్లు పడుతున్నాయి.
* ప్రజల్లోకి వచ్చేది ఎప్పుడు?
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గుర్తుచేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తానని చెప్పారు. అయితే ఈ ప్రకటన వచ్చి ఏడాది దాటుతోంది. గత ఏడాది సంక్రాంతికి ముందు ఈ ప్రకటన చేశారు. కానీ జనాల్లోకి రాలేదు. మరో సంక్రాంతి సైతం దాటిపోయింది. కనీసం ఇప్పుడైనా వస్తారా అని ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లోకి వెళ్లడం కంటే.. వైసీపీ నేతల పై జరుగుతున్న దాడుల ఘటనలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా పొలిటికల్ మైలేజ్ వస్తుందని భావిస్తున్నట్టు ఉన్నారు. అయితే ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు అనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే ఇప్పటివరకు జగన్ పరామర్శించిన వైసీపీ నేతలంతా వివాదాస్పద ముద్ర ఉన్నవారే. అంబటి రాంబాబు నడిరోడ్డుపై అందరూ వింటున్నట్టుగా సీఎం చంద్రబాబుపై బూతు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఒక పార్టీ నేతగా అండగా ఉండడం తప్పులేదు కానీ.. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యను సమర్థిస్తూ.. దానిని రాజకీయం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి తగదని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పార్టీని యాక్టివ్ చేయాలంటే ఇటువంటి అంశాలనే పరిగణలోకి తీసుకోవాలన్నట్టు జగన్ వైఖరి ఉంది. ప్రస్తుతం అయితే భారీ జన సమీకరణ నడుమ జగన్ గుంటూరు పర్యటన సాగుతోంది. అయితే ఆయన వెళ్తోంది పరామర్శకా? లేకుంటే బల ప్రదర్శనకా? అనే ప్రశ్నలు మాత్రం ఉత్పన్నం అవుతున్నాయి.