Dharmana Prasad Rao YSRCP Offer: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) గుణపాఠాలు నేర్చుకున్నారా? జూనియర్లను నమ్ముకుంటే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారా? అందుకే సీనియర్ల సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురికావడం జగన్మోహన్ రెడ్డికి లోటు. అందుకే మరింత మంది సీనియర్లను తెరపైకి తెచ్చి వారితో జూనియర్లతో రాజకీయం చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు కు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల ధర్మానతో నేరుగా ఫోన్లో మాట్లాడిన జగన్ ఒక ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వడంతో పాటు ధర్మాన ప్రసాదరావుకు రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక షరతు పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
* ఓటమి తర్వాత సైలెన్స్..
మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ) పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఇంటికి పరిమితం అయ్యారు. కూటమి పార్టీల్లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే అటు నుంచి సానుకూలత రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే తిరిగి యాక్టివయ్యారు. గత కొంతకాలంగా గట్టిగానే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధర్మాన ప్రసాదరావు వాగ్దాటి, వ్యూహాలు వినియోగించుకుంటే మంచిదని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రెండు రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి నేరుగా ధర్మాన ప్రసాదరావు కు ఫోన్ చేసి గంటపాటు మాట్లాడినట్లు సమాచారం. సమకాలీన రాజకీయ అంశాలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తే మంచిది అని అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* ఎంతోమంది నేతలు ఉన్నా..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించే నేతలకు కొదవలేదు. అయితే వారంతా జూనియర్ నేతలు. ఎంతవరకు వారితో పని చేయించుకోవాలే తప్ప వారికి పెత్తనం అప్పగిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్ నేతగా ధర్మాన ప్రసాదరావు కనిపిస్తున్నారు. పైగా బలహీన వర్గాలకు చెందిన నేత. విశేష అనుభవం ఉంది. అందుకే పార్టీ రాష్ట్ర సమన్వయకర్త పదవి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్, పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ పదవి ఇస్తానని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ధర్మాన ప్రసాదరావు సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం నడుస్తోంది. త్వరలో ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర సమన్వయకర్త బాధ్యతలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.