Jagan IB Report to AP High Court: ఇటీవల ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన జిల్లాలకు వచ్చే సమయంలో భద్రతా వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు భద్రత తగ్గించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే జగన్ ప్రతిపక్ష నేత కాదు. ఒక పార్టీ అధినేతగా ఆయనకు ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనిపై సంతృప్తి చెందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జగన్ భద్రతకు సంబంధించి ఏపీ హైకోర్టుకు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికను ఇచ్చింది. ఆయన భద్రతకు ఎలాంటి ముప్పు లేదని ఇంటలిజెన్స్ బ్యూరో నివేదిక సమర్పించింది.
Also Read: Jagan Disqualification Fear 2025: జగన్ అరెస్ట్.. జరిగేది అదే!
మే నెలలో పిటిషన్..
తనకు కేంద్ర భద్రత సంస్థలు అయిన సిఆర్పిఎఫ్( CRPF), ఎన్ ఎస్ జి తో జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి మే నెలలో పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి తగినంత భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జగన్ తరుపు న్యాయవాది నాగిరెడ్డి తన వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేదన్న వాదనలో నిజం లేదని ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు 58 మందితో జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు వాదనలు వినిపించారు. అప్పట్లో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. తాజాగా విచారణకు రాగా ఇంటలిజెన్స్ బ్యూరో కీలక నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ తో పాటు ఐబి నివేదికను కూడా జత చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసు విచారణను జూలై 15కు వాయిదా వేశారు.
కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా తనకు భద్రత తగ్గించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీని( Z plus security) కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుండగానే ఇంటలిజెన్స్ బ్యూరో కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఈ విషయాన్ని కేంద్రం తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ విచారణను వాయిదా వేసింది. రెండు రోజుల కిందట వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటే తాడేపల్లి వద్ద ఇద్దరు యువకులు తాటికాయలు విసరడం కలకలం రేపింది. మరోవైపు పల్నాడులో పర్యటన సందర్భంగా జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. జగన్మోహన్ రెడ్డికి భద్రత పెంచాలని కోరింది.
Also Read: Pawan Kalyan Morphing Arrests: పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం.. ముగ్గురి అరెస్ట్!
వైసీపీ శ్రేణుల్లో ఆందోళన..
మరోవైపు ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనల సమయంలో దారుణ పరిణామాలు ఎదురవుతున్నాయి. అనంతపురం జిల్లా( Ananthapuram district) పర్యటన సమయంలో హెలిపాడ్ వద్దకు ప్రజలు దూసుకొచ్చారు. మరోవైపు మరో జిల్లా పర్యటన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలవడంతో ఆ ప్రాంతంలో జగన్ నివాసం ఉండడం.. తరచూ ఆయన నివాసం వద్ద పరిణామాలు జరుగుతుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన ఉంది. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.