Jagan: ఏపీ సీఎం జగన్( Jagan Mohan Reddy) ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. గత కొద్ది రోజులుగా లండన్ లో ఆయన పర్యటిస్తున్నారు. ఆయన విదేశాల్లో ఉండగా వైసీపీకి షాక్ ఇచ్చారు కీలక నేత విజయసాయిరెడ్డి. పార్టీ సభ్యత్వం తో పాటు రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే విజయసాయి రెడ్డి రాజీనామా వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది. పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ నింపింది. అయితే కూటమి తన పార్టీని టార్గెట్ చేయడంపై జగన్ పునరాలోచనలో పడ్డారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడంతో పాటు దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇకనుంచి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. అవసరం అనుకుంటే బడ్జెట్ సమావేశాలకు హాజరై తన వాయిస్ను వినిపించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
* పార్టీ ముఖ్యులతో సమావేశం
వాస్తవానికి ఫిబ్రవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ పై( fees reimbursement ) భారీ ఆందోళనకు వైసీపీ సిద్ధమైంది. అదే రోజు జగన్ లండన్ నుంచి ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఆందోళనను వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న పార్టీ ముఖ్యులతో జగన్ ప్రత్యేక సమావేశం కావాలని నిర్ణయించారు. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కారణం ఏంటనేది పార్టీ నేతలతో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ పై కూడా ఒక స్పష్టత ఇవ్వనున్నారు. తనతో విజయసాయిరెడ్డి ప్రస్తావించిన కారణాలు, తాను ఏం చెప్పింది పార్టీ నేతలకు వివరించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. సాయి రెడ్డి పార్టీ వీడిన తర్వాత కేడర్లో కొనసాగుతున్న డైలమాకు ముగింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం జగన్ నేరుగా మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
* అన్నింటికీ ఫుల్ క్లారిటీ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తనపై సీఎం చంద్రబాబు ( CM Chandrababu)చేసిన ఆరోపణలు, స్టీల్ ప్లాంట్ అంశంపై జగన్ గళం ఎత్తే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సంక్షేమ పథకాలు అమలు కష్టమని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో దీనిపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు జగన్ జిల్లాల పర్యటనపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 45 రోజుల కిందట తాను ప్రజాక్షేత్రంలోకి వస్తానని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వారానికి మూడు రోజులపాటు పర్యటిస్తానని అప్పట్లో చెప్పుకొచ్చారు. మధ్యలో విదేశీ పర్యటన సాగింది. అయితే పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో వారి అభిప్రాయాలను తీసుకొనున్నారు జగన్.
* బడ్జెట్ సమావేశాలకు హాజరు
మరోవైపు కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు( budget sessions ) జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తన వాదనలు వినిపించేందుకు అదే సరైన సమయం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ నుంచి నేరుగా జిల్లాల పర్యటనలకు సిద్ధపడితే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. అయితే ఏకకాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు, జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి ఎంతమంది నేతలు బయటకు వెళ్లిపోయినా.. ఉన్నవారితో రాజకీయం చేయాలని జగన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే జగన్ తాడోపేడోకు సిద్ధపడుతున్నారు.