YS Jagan Failed Experiments: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలని చూస్తోంది. ప్రధానంగా ప్రకాశం జిల్లా పై దృష్టి పెట్టింది. అక్కడ ఓ రెండు నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెంచారు. ముఖ్యంగా అద్దంకి తో పాటు పర్చూరు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని భావిస్తున్నారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. అందుకే ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అద్దంకిలో చింతలపూడి అశోక్ కుమార్ ను ఇన్చార్జిగా నియమించారు. పర్చూరులో గాదె మధుసూదన్ రెడ్డిని ఇన్చార్జిగా నియామకం చేపట్టారు. కానీ రెండు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం లేదు. పైగా పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొత్త నాయకత్వం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు.
* వరుసగా గెలుస్తున్న గొట్టిపాటి..
అద్దంకి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు గొట్టిపాటి రవికుమార్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయనకు వ్యక్తిగతంగా మంచి గ్రాఫ్ ఉంది. ఇప్పటివరకు ఆయన నాలుగు సార్లు గెలిచారు ఆ నియోజకవర్గం నుంచి. ఈ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సైతం మంచి బలం ఉంది. కానీ నాయకత్వం ప్రోత్సహించడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిలవుతున్నారు. అందుకే గొట్టిపాటి రవికుమార్ మాస్ ఇమేజ్ ముందు వైసీపీ అభ్యర్థులు తేలిపోతున్నారు. ప్రస్తుత వైసిపి ఇన్చార్జ్ కూడా ప్రజలతోపాటు వైసీపీ క్యాడర్ తో పెద్దగా మమేకం కాలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అటు పర్చూరులో సైతం అదే పరిస్థితి ఉంది. అక్కడ టిడిపి మంచి బలం మీద ఉంది. ఇక్కడ ఏలూరు సాంబశివరావు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన సరైన నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దొరకడం లేదు
* కరణం బలరాం ఉన్నా..
కరణం బలరామకృష్ణ రూపంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కమ్మ నేత ఉన్నారు. కానీ ఆయన చీరాలలో ప్రస్తుతం ఉన్నారు. ఆయన పూర్వశ్రమం అద్దంకి. కానీ అక్కడ గొట్టిపాటి రవికుమార్ మాస్ ఇమేజ్ను ఢీ కొట్టాలి అంటే కరణం బలరామకృష్ణమూర్తి అయితే సరిపోతారు. కానీ అందుకు కారణం బలరాం ఒప్పుకోవడం లేదు.. అయితే పూటకో లీడర్ ను తెచ్చి అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా పెడుతున్నారు. పర్చూరు పరిస్థితి కూడా అలానే ఉంది. అక్కడ టిడిపి స్ట్రాంగ్ గా ఉంది. మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు కూటమికి అండగా నిలబడుతున్నారు. అయితే ఆ రెండు నియోజకవర్గాల్లో జగన్ చేస్తున్న ప్రయోగాలు విఫలమవుతూనే ఉన్నాయి. దీంతో ఆ జిల్లాలో ఆ రెండు నియోజకవర్గాల పై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందే అన్నది మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం.
