Pawan Kalyan
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రచారం కలిసి రావడం లేదు. పిఠాపురంలో ముహూర్తం పెట్టి మరి ఎన్నికల ప్రచారానికి దిగారు. కానీ ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పిఠాపురంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. రోజంతా జనంతో ఉండగా జ్వరం వచ్చింది. దీంతో సాయంత్రానికి హైదరాబాదు వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు మళ్ళీ పిఠాపురం వచ్చారు.. మళ్లీ జ్వరం తిరగబెట్టింది. దీంతో హైదరాబాద్ ప్రయాణం కావాల్సి వచ్చింది. నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. అనారోగ్యానికి గురైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అనకాపల్లి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న క్రమంలో కారులో సొమ్మసిల్లి పోయారని వార్తలు వచ్చాయి. దీంతో జనసైనికులు ఆందోళన నెలకొనగా.. ఆరోగ్యమే మహాభాగ్యం.. ముందు రెస్ట్ తీసుకోండి పవన్ సార్ అంటూ.. వెటకారంతో కూడిన కామెంట్స్ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది.
ఎన్నికలకు పట్టుమని 35 రోజులు కూడా లేవు. పవన్ ఇప్పటివరకు పర్యటించింది రెండే రెండు నియోజకవర్గాలు. తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో నాలుగు రోజులు పాటు ఉండి ప్రచారం పూర్తి చేయాలన్నది పవన్ ప్లాన్. కానీ జ్వరం కారణంగా రెండు రోజులకు పరిమితమయ్యారు. అటు ఉత్తరాంధ్ర పర్యటన సైతం రద్దయింది. అనకాపల్లి ఇలా వెళ్లారో లేదో.. అలా వచ్చేశారు. హైదరాబాద్ వెళ్ళిపోయారు. అసలు మిగతా నియోజకవర్గాల్లో ఎప్పుడు పర్యటిస్తారో కూడా తెలియని పరిస్థితి. తెనాలిలో నాదెండ్ల మనోహర్ కి మద్దతుగా ఈనెల 3న ప్రచారం చేస్తారని షెడ్యూల్ ప్రకటించారు. తీరా బహిరంగ సభ సమయానికి రెండు మూడు గంటల ముందు.. అనారోగ్య కారణాలతో రాలేనంటూ ప్రకటన చేశారు. దీంతో అక్కడ నాదెండ్ల మనోహర్ నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 6 నుంచి ఉత్తరాంధ్రలో పవన్ పర్యటిస్తారని షెడ్యూల్ ప్రకటించారు. మళ్లీ సాయంత్రానికి మరో అప్డేట్ ఇచ్చారు. అనారోగ్యంతో పవన్ రాలేదని.. ఆయన ఆరోగ్యం కుదుటపడలేదని చెప్పుకొచ్చారు. 7న పవన్ ఎలాగోలా అనకాపల్లి వచ్చారు. బహిరంగ సభలో పాల్గొన్నారు. దీంతో పవన్ యాక్టివ్ అవుతారని అంతా భావించారు. కానీ అనకాపల్లి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కు వెళ్తుండగా అస్వస్థతకు గురయ్యారని టీవీ ఛానల్లో ట్రోలింగ్ వచ్చింది. దీంతో పవన్ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందని జనసేన లోనే ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. వాస్తవానికి ఈ నెల 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొనాలి. కానీ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారా? లేదా?అన్నది చూడాలి.
మరోవైపు ఈరోజు ఎలమంచిలి లో పవన్ ఎన్నికల ప్రచార సభ రద్దయింది. జ్వరంతో బాధపడుతూ ఉండడంతో పవన్ నీరసంగా కనిపిస్తున్నారు. రెండు రోజులపాటు ఆయనకు విశ్రాంతి అవసరమని నిపుణులు సూచించారు. దీంతో ఈరోజు ఎలమంచిలి పర్యటన వాయిదా పడింది. రేపు ఉగాది వేడుకలు పిఠాపురంలో ఆయన జరుపుకోవాలని.. 9 10 తేదీల్లో చంద్రబాబుతో కలిసి గోదావరి జిల్లాలో ఐదు సభల్లో పవన్ పాల్గొనాల్సి ఉంది. అటు తరువాత తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా ప్రచారం చేయాల్సి ఉంది. అయితే తాజాగా పవన్ అస్వస్థతకు గురికావడంతో ఈ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే అదునుగా వైసీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేస్తోంది. 30 నిమిషాలు బహిరంగ సభలో మాట్లాడలేకపోయారని.. అస్వస్థతకు గురయ్యారని ఎద్దేవా చేస్తోంది. దీనిపై జనసైనికులు సైతం స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.
30 min మీటింగ్ చెప్పినందుకే స్పృహ తప్పి పడిపోయిన @PawanKalyan
ఆంధ్ర నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు pic.twitter.com/IPlAOPvh0V
— MBYSJTrends ™ (@MBYSJTrends) April 7, 2024