Homeఆంధ్రప్రదేశ్‌Jagan: పులివెందులలో జగన్ కు సడలుతున్న పట్టు.. కారణం ఇదేనా..?

Jagan: పులివెందులలో జగన్ కు సడలుతున్న పట్టు.. కారణం ఇదేనా..?

Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ గురించి మాట్లాడితే పులివెందుల నుంచే మొదలు పెట్టాలి. పులివెందుల ఆయన కోటా.. ఏ నాయకుడు వచ్చినా ఆయనను ఓడించడం కష్టమనే చెప్పాలి. పులివెందుల నియోజకవర్గం ఏర్పడి 69 సంవత్సరాలు గడుస్తుంది. అప్పటి నుంచి ఎక్కువ సంవత్సరాలు గెలిచింది కాంగ్రెస్ పార్టీనే. వైసీపీ పురుడు పోసుకున్న తర్వాత ఇక్కడే బలంగా మారింది. పులివెందుల వైఎస్ కుటుంబం అడ్డాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1978లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజయం సాధించిన తర్వాత అప్పటి నుంచి ఆయన కుటుంబానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జెండా పాతారు. మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో ఆయనే గెలుపొందారు. కానీ రాను రాను వైసీపీ అధినేత పరిస్థితి ఘోరంగా మారుతోంది. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైసీపీ పార్టీకి చెందిన వారు ఎవ్వరూ కూడా పులివెందులలో విజయం సాధించలేదు. పరిస్థితి తెలుసుకొని స్వయంగా అవినాష్ రెడ్డే రంగంలోకి దిగినా ప్రయోజనం లేదు. ఆయనను అరెస్ట్ చేసి ఎన్నికలు నిర్వహించారు.

సాధారణంగా అన్ని సాగునీటి సంఘాలు వైసీపీ గుప్పిట్లోనే ఉంటాయి. ప్రతీ గ్రామంలో జగన్ కు మంచి పట్టుంది. ప్రతీ సారి నిర్వహించిన ఈ ఎన్నికల్లో మెజార్టీ లక్ష వరకూ వచ్చేది. కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారింది. ఎమ్మెల్సీ భూమిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీటెక్ రవి కలిసి నియోజకవర్గంలో టీడీపీకి పట్టు పెంచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీటెక్ రవి నియోజకవర్గంలో పర్యటిస్తూ గ్రామాల్లో టీడీపీ ప్రాబల్యం పెంచుతున్నారు. ఇప్పుడు టీడీపీకి అధికారం కూడా తోడవడంతో సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ వారిదే పైచేయి అయ్యింది.

కొన్ని గ్రామాల్లో టీడీపీ వాళ్లకు జాబ్ ఉండేది కాదు. కానీ ఆరు నెలలుగా ఆ పరిస్థితి మారింది. అన్ని గ్రామాల్లో వైసీపీకి పోటీగా టీడీపీ వర్గం తయారైంది. ఇదే గేమ్ ఛేంజర్ గా మారుతుంది. జగన్ పులివెందుల వ్యవహారాలను స్వయంగా పట్టించుకోవడం లేదు. ఆయన తరఫున అవినాష్ రెడ్డి, ఆయన బంధువులే అక్కడ పెత్తనం చేస్తుంటారు. ఇప్పుడు వారి నిర్వాకం వలనే సాగునీటి సంఘాల్లో పట్టు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు స్వయంగా జగన్ జోక్యం చేసుకున్నా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, అందులో టీడీపీ అజమాయిషీగా ఉండడం, కేంద్రంలో ఎన్డీయే ఉండడంతో పులివెందులలో జగన్ వర్గం సైలెంట్ అయిపోయింది. వైసీపీ పార్టీకి చెందిన గల్లీ లీడర్ నుంచి జగన్ కు దగ్గరి బంధువుల వరకు సైలెంట్ అయిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచినా పెద్దగా పులివెందుల నియోజకర్గంలో పార్టీ బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయలేదు. కానీ ఈ సారి మాత్రం టీడీపీ ఎలాగైనా అక్కడ జెండా పాతాలని ప్రయత్నాలు చేస్తోంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version