Chandrababu: ఏపీలో ఒక్కొక్కరిపై అప్పు అంత ఉందా? చంద్రబాబు శ్వేత పత్రాలతో మైండ్ బ్లాక్!

ఏపీ అప్పుల కుప్పగా మారింది. రోజురోజుకు అప్పు పెరుగుతోంది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో సంక్షేమం మాటున లూటీ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. విధ్వంసం, అవినీతిపై వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు చంద్రబాబు.

Written By: Dharma, Updated On : July 26, 2024 4:43 pm

Chandrababu

Follow us on

Chandhrababu : చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే.. మరోవైపు వైసీపీ సర్కార్ వైఫల్యాలను బయటపెడుతున్నారు. జగన్ చేసిన తప్పిదాలను ఎండగడుతున్నారు. శాసనసభ వేదికగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పదేళ్ల ఆర్థిక పరిస్థితి పై సీఎం చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి ఏంటి? వైసిపి హయాంలో పాలన ఎలా సాగింది? విధ్వంసం ఏ రేంజ్ లో జరిగింది? దానిని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అన్న వివరాలను సీఎం చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని.. తయారీ రంగం తెలంగాణకు వెళ్లిపోవడం.. ఏపీకి వ్యవసాయ రంగం మాత్రమే మిగలడంతో ఆర్థిక పురోగతి లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. అయినా సరే 2014 నుంచి 2019 మధ్య రాష్ట్ర అభివృద్ధికి టిడిపి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నామని.. అప్పట్లోనే ఐదు లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు చంద్రబాబు. విభజన సమస్యలు పరిష్కారం కాలేదని.. గత ఐదేళ్లుగా జగన్ చొరవ చూపలేదని.. అదే చేసి ఉంటే తెలంగాణతో సమానంగా ముందుకెళ్లేవారమని చంద్రబాబు వివరించారు. కనీసం టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యేవన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగించి ఉంటే మూడు లక్షల కోట్ల ఆస్తి ఏపీకి సొంతమయ్యేది అన్నారు. జగన్ సర్కార్ ఆస్తులు తాకట్టు పెట్టి 9.74 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని వెల్లడించారు.

* తలసరి అప్పు రూ. 1.44 లక్షలు
శాసనసభలో కీలక విషయాలను వెల్లడించారు చంద్రబాబు. ముఖ్యంగా ప్రతి మనిషి పై అప్పు విషయంలో స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ఒక్కరి పైన తలసరి అప్పు రూ. 1.44 లక్షలు గా ఉందని వెల్లడించారు. వైసిపి విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం వనరులు తగ్గుముఖం పట్టాయని.. అప్పులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఆదాయం పైన అప్పులు చేసిన ఒకే ఒక్కసారి జగన్ అని చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి ఆలోచనలు ప్రపంచంలో ఎవరికి రావని.. ప్రతి శాఖలోనూ నిధులను ఖాళీ చేశారని ప్రకటించారు చంద్రబాబు.

* వైసిపి ఉక్కిరి బిక్కిరి
వరుస శ్వేత పత్రాలతో వైసీపీకి చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేశారు. గనుల దోపిడీ ద్వారా రాష్ట్రానికి రూ. 9750 కోట్ల మేర నష్టం జరిగిందని చంద్రబాబు వెల్లడించారు. మద్యం విధానంతో 30 వేల కోట్లు పక్కదారి పట్టిందని కూడా ప్రకటించారు. విద్యుత్తు విధానాలతో రూ. 1.29 లక్షల కోట్లు నష్టం వాటిల్లిన విషయాన్ని ప్రస్తావించారు. మొత్తంగా వైసిపి రూ. 9.74లక్షల కోట్లు అప్పు చేసిన వైనాన్ని వెల్లడించారు చంద్రబాబు.

* వేదిక మార్చిన చంద్రబాబు
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తూ వచ్చారు చంద్రబాబు.మీడియా ప్రతినిధుల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీటిని వెల్లడించారు. అయితే శాసనసభ సమావేశాల నేపథ్యంలో.. జగన్ హాజరవుతారని తెలిసి వేదికను అసెంబ్లీకి మార్చారు. కానీ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ఢిల్లీలో జగన్ దీక్ష చేపట్టారు. దీంతో అసెంబ్లీని వాకౌట్ చేశారు.అయినా సరే చంద్రబాబు శాఖల పనితీరుపై శ్వేత పత్రాల విడుదలను కొనసాగించారు. ఈరోజు ఆర్థిక శాఖ పై విడుదల చేసిన శ్వేత పత్రం లో వైసీపీ సర్కార్ చేసిన అప్పులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు.