Minister Satyakumar Yadav : ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్ భారత్.. మంత్రి సత్యకుమార్ యాదవ్ కు కొత్త చిక్కు!

ఏపీలో మూడు పార్టీల క్యాబినెట్ నడుస్తోంది. బిజెపికి అనూహ్యంగా ఒక మంత్రి పదవి దక్కింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సత్య కుమార్ యాదవ్ కీలకమైన ఆరోగ్యశాఖను దక్కించుకున్నారు. కానీ కేంద్ర, రాష్ట్రపథకాల అమలు విషయంలో బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు.

Written By: Dharma, Updated On : August 20, 2024 5:33 pm

Minister Satyakumar Yadav

Follow us on

Minister Satyakumar Yadav : ఆరోగ్యశ్రీ.. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక. ఎవరు అవునన్నా.. కాదన్నా.. దేశంలోనే ఈ పథకం ఆదర్శం. అందుకే మిగతా రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పేదల వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్అమలు చేస్తున్న అది ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదు.బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ పథకంలో ఎక్కువమంది నమోదు అవుతున్నారు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆరోగ్యశ్రీ విపరీతంగా డామినేట్ చేస్తోంది. పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులో నమోదైతే.. ఆరోగ్యశ్రీ కార్డు రద్దు అవుతుందన్న ఆందోళన ప్రజల్లో ఉంది. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా విపక్షాలు ఆరోపణలు చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా వైసీపీకిది ప్రచార అస్త్రంగా మారింది. ఆరోగ్యశ్రీనినిలిపి వేయడంలో భాగంగానే ఈ కుట్ర అని ప్రత్యర్థులు ఆరోపించడం ప్రారంభించారు.ఇది ప్రజల్లోకి వెళ్లడంతో ఆరోగ్యశ్రీ సేఫ్ జోన్ లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది.వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని పెంచారు. ఐదు లక్షల రూపాయలు ఉన్న పరిధిని 25 లక్షలకు పెంచి ప్రకటించారు. ఆరోగ్యశ్రీ జాబితాలో మరిన్ని రోగాలను చేర్చారు. అందుకే ఆరోగ్యశ్రీ విషయంలో ఏ చిన్న ప్రకటన వచ్చినా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలని చూస్తే ఆరోగ్యశ్రీ నిలిచిపోతుందన్న బెంగ ఏపీ ప్రజలను వెంటాడుతోంది.

* సరికొత్తగా ఒత్తిడి
అయితే ఆయుష్మాన్ భారత్ అమలు విషయంలో బిజెపి నేత, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పై సరికొత్త ఒత్తిడి పెరుగుతోంది. బిజెపి నాయకుడు కావడం, పైగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సత్య కుమార్ ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ కార్డులను పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఏపీలో అమలు చేయడం ఇబ్బందికరంగా మారింది. ఆరోగ్య శ్రీ తప్పించి మరో పథకానికి ప్రజలు ఇష్టపడడం లేదు.

* ప్రజారోగ్యానికి పెద్దపీట
పొత్తులో భాగంగా రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. సూపర్ విక్టరీ సాధించాయి. రాష్ట్ర క్యాబినెట్లో బిజెపికి ఒక మంత్రి పదవి లభించింది. అనూహ్యంగా సత్య కుమార్ యాదవ్ కు పదవి వరించింది.కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆయుష్మాన్ భారత్ పథకానికి పెద్ద పీట వేశారు.దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. కానీ సొంత పార్టీ నేత ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా.. ఏపీలో మాత్రం అమలు చేయలేకపోతున్నారు.

* ఏ నిర్ణయం తీసుకోలేక
ఏపీలో ఆరోగ్యశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ కు చంద్రబాబు పూర్తి బాధ్యతలు అప్పగించారు.తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సత్య కుమార్ యాదవ్ కు మంత్రి పదవి కత్తి మీద సామే. అయినా సరే పట్టు సాధించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్ భారత్ ను తెరపైకి తెస్తే ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుందని ఆయన భయపడుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అడుగులు వేయాలని భావిస్తున్నారు. మొత్తానికైతే బిజెపి నాయకుడై ఉండి.. ఓ పథకం విషయంలో ఇంతలా ఇబ్బంది పడుతుండడం విశేషమే.