Chandrababu: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. వచ్చే నెల రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆశవాహులు ఎవరికి వారే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం ఉండడంతో మూడు పార్టీల మధ్య రెండు పదవులు సర్దుబాటు కష్టం. అయితే గతంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు విషయంలో బిజెపితో పాటు జనసేనకు కేటాయింపులు చేసింది తెలుగుదేశం. అయితే ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ రెండు స్థానాలను తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు బిజెపి పెద్దలకు కూడా తెలియజేశారని ప్రచారం సాగుతోంది. అయితే తెలుగుదేశం పార్టీలో ఆశావహులు 10 మందికి పైగా ఉన్నారు. వారికి సీట్ల సర్దుబాటు చేయడం అంటే కష్టంతో కూడుకున్న పని. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారితో పాటు పార్టీ కోసం పని చేసిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
* రెండు ఎమ్మెల్సీలు ఖాళీ..
వైసిపి హయాంలో గవర్నర్ కోటా కింద కడప జిల్లాకు చెందిన జాకియా ఖానం, పండు రవీంద్రబాబు ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యారు. వారి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. వారి స్థానంలో ఇద్దరి ఎంపిక అనివార్యంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వంగవీటి రాధాకృష్ణ, పిఠాపురం వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న, మహాసేన రాజేష్, వర్ల రామయ్య లాంటి చాలామంది నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పిఠాపురం వర్మతో పాటు వంగవీటి రాధాకృష్ణకు ఛాన్స్ ఇస్తారని పొలిటికల్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు టిడిపి కి కావాల్సిన నేతలు. గతంలో ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు ఈ ఇద్దరికీ. అందుకే ఆ రెండు పదవులను వీరితో సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
* వంగవీటి వారసుడికి..
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాపులపై విపరీతంగా ప్రభావితం చూపే వంగవీటి మోహన్ రంగ కుమారుడిగా ఉన్న రాధాకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రంగా వారసుడిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తే.. టిడిపి అండగా నిలిచిందన్న సానుకూల వైఖరి ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశాకిరణ్ సైతం కూటమి వైపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫ్యామిలీని కూటమి వైపు తీసుకు రావడం ద్వారా గట్టి సంకేతాలు పంపవచ్చు. అందుకే చంద్రబాబు రాధాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
* పిఠాపురం వర్మకు..
పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు పిఠాపురం వర్మ. అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర వర్మది. అటువంటి వర్మ పవన్ కోసం తన సీటును వదులుకున్నారు. అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో.. వర్మ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగానే సాఫీగా ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Displaying
