Ganta Srinivasa Rao: గంటా వైసిపిలోకా?

గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నారు.కానీ చంద్రబాబు మాత్రం విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానాన్ని ఆఫర్ చేశారు. అయితే అక్కడ బొత్స సత్యనారాయణ పై పోటీకి గంటా విముఖత చూపుతున్నారు.

Written By: Dharma, Updated On : March 16, 2024 11:00 am

Ganta Srinivasa Rao

Follow us on

Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టిడిపిలో చేరతారా? ఆయన వైసీపీని వీడడం దాదాపు ఖాయమా? ఆయనకు ఏ సీటు ఆఫర్ చేశారు? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? పొలిటికల్ సర్కిల్లో బలమైన చర్చ నడుస్తోంది. గంటా టిడిపికి గుడ్ బై చెప్తారని వైసీపీ అనుకూల మీడియా రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వైసీపీలో చేరతారని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఆ పార్టీ అనుకూల మీడియా ఇదే కథనాలు ప్రచురిస్తుండడంతో ఖాయం అన్న నిర్ణయానికి వస్తున్నారు. వరుసగా కాపు నేతలు వైసీపీలో చేరుతుండడంతో.. గంటాను కూడా వైసీపీలోకి ఆహ్వానిస్తారని ప్రచారం జరుగుతోంది.

గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నారు.కానీ చంద్రబాబు మాత్రం విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానాన్ని ఆఫర్ చేశారు. అయితే అక్కడ బొత్స సత్యనారాయణ పై పోటీకి గంటా విముఖత చూపుతున్నారు. భీమిలికి తొలి ప్రాధాన్యమిస్తూ టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు.లేకుంటే విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో.. ఏదో ఒక దానిని ఇవ్వాలని పట్టుపడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం హామీ ఇవ్వడం లేదు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తున్నారు. దీంతో విశాఖ జిల్లా దాటితే పార్టీలో అంత ప్రాధాన్యం ఉండదని గంటా భావిస్తున్నారు. అందుకే పార్టీని వీడడం శ్రేయస్కరమని అనుచరులు సైతం సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరతారని బలమైన ప్రచారం జరుగుతోంది. అది కూడా వైసిపి అనుకూల మీడియాలో జరుగుతుండడం గమనించాల్సిన విషయం.

అయితే గంటా వైసీపీలో చేరితే భీమిలి టిక్కెట్ దక్కుతుందా? అంటే అది డౌటే. పోనీ విశాఖ నగరంలో ఏదో ఒక నియోజకవర్గంలో సర్దుబాటు చేసే పరిస్థితి ఉందా? అది కూడా లేదనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెంట కాపు సామాజిక వర్గం నడుస్తుందన్న విశ్లేషణల నేపథ్యంలో.. ముద్రగడ పద్మనాభం, హరి రామ జోగయ్య కుమారుడు లాంటి కాపు నేతలను వైసీపీలో చేర్చుకున్నారు. వారికి ఈ ఎన్నికల్లో టికెట్లు కేటాయించకపోయినా.. అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గంటా విషయంలో సైతం అదే జరుగుతుందని ఎక్కువమంది భావిస్తున్నారు.

అయితే పవర్ పాలిటిక్స్ కు గంటా శ్రీనివాసరావు ఇష్టపడతారు. ప్రత్యక్ష ఎన్నికల కి ప్రాధాన్యమిస్తారు. అందుకే ఆయనకు టికెట్ ఖరారు చేస్తే కానీ వైసీపీలో చేరారు అన్న ప్రచారం జరుగుతోంది. తప్పకుండా విశాఖ జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని జగన్ ఆయనకు ఖరారు చేస్తేనే.. వైసీపీలోకి వచ్చే ఆలోచన చేస్తారని కూడా తెలుస్తోంది. అయితే భీమిలిలో ఇప్పటికే అవంతి శ్రీనివాసరావు పేరును ఖరారు చేశారు. గంటా కోసం ఆయన స్థానాన్ని వదులుకుంటారా అంటే.. అది జరగని పని అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే అటు అనకాపల్లి ఎంపీ సీటు నుంచి గంటాను పోటీచేస్తారని టాక్ నడుస్తుంది. అయితే రకరకాల ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. మరోవైపు గంటా జనసేనలో చేరి భీమిలి అసెంబ్లీ టికెట్ దక్కించుకుంటారన్న ప్రచారం కూడా నడుస్తోంది. కానీ వైసీపీ అనుకూల మీడియాలో గంటాకు ఎనలేని ప్రాధాన్యం లభిస్తుండడం.. వైసిపి లోకి వెళ్తారన్న ప్రచారానికి ఎక్కువగా బలం చేకూరుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.