AP Free Sand Policy: నేటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం.. విధివిధానాలివీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భవన నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. ఇటువంటి సమయంలో ఇసుక ఉచితంగా అందిస్తే ఎంతో ప్రయోజనం అని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందించాలని ప్రయత్నిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో తలెత్తిన లోపాలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది.

Written By: Dharma, Updated On : July 8, 2024 12:59 pm

AP Free Sand Policy

Follow us on

AP Free Sand Policy: వైసిపి హయాంలో ప్రభుత్వ పాలసీలు విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. ఈ ఎన్నికల్లో దారుణ పరాజయానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఇసుక విధానంలో జగన్ సర్కార్ అబాసు పాలయ్యింది. ఇసుక దొరకక నిర్మాణాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఉపాధి లేక కార్మికులు వీధిన పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. నూతన ఇసుక విధానంపై కసరత్తు ప్రారంభించారు. గత అనుభవాలు దృష్ట్యా ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించారు. ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలులోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొత్త పాలసీని అమలు చేయనుంది.

పారదర్శకంగా ఇసుక విధానం అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. నామమాత్రపు రుసుములతో చెల్లింపులు చేయాలని.. డిజిటల్ విధానంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్రపు రుసుములను నేరుగా కాకుండా డిజిటల్ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వెలుగు చూసిన లోపాలను అధిగమించాలన్న నేపథ్యంలో.. పక్కా ప్రణాళికతో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. మరి ముఖ్యంగా ఎటువంటి నగదు లావాదేవీలకు ఆస్కారం లేకుండా.. డిజిటల్ చెల్లింపుల ద్వారా మాత్రమే రుసుములను స్వీకరించేందుకు సిద్ధమయింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. భవన నిర్మాణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. ఇటువంటి సమయంలో ఇసుక ఉచితంగా అందిస్తే ఎంతో ప్రయోజనం అని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందించాలని ప్రయత్నిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో తలెత్తిన లోపాలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కోనసీమ, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం, కృష్ణా, అనంతపురం మినహా మిగతా 20 జిల్లాల్లో ఇసుక డంపు నిల్వ కేంద్రాల వద్ద ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాలను డిజిటల్ చెల్లింపులు స్వీకరణ కోసం బ్యాంక్ ఖాతాలను తెరిచారు. ఇక ఇసుక నిల్వ కేంద్రాలు, వాటిలో ఉండే ఇసుక నిల్వ ల గురించి గనుల శాఖ అధికారిక వెబ్ సైట్ లో అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఫ్రీగా ఇసుక అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు.