I-Pack Team : ఐ ప్యాక్ టీమ్ మరీ ఇంత బరితెగింపా?

కనిగిరిలో జరుగుతున్న యాత్రలో అనుమానాస్పదంగా కొత్తముఖాలు కనిపించాయి. దీంతో టీడీపీ శ్రేణులు వారిని గుర్తించారు. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారంటూ నిలదీశారు. సరైన సమాధానం చెప్పలేక కొందరు అక్కడ నుంచి వెనుదిరిగారు. ఇద్దరు మాత్రం పట్టుబడ్డారు. ఆరాతీస్తే తాము ఐ ప్యాక్ టీమ్ సభ్యులమని ఒప్పుకున్నారు.

Written By: Dharma, Updated On : July 20, 2023 1:16 pm
Follow us on

I-Pack Team : ఏపీలో వైసీపీ కదలికల వెనుక కచ్చితంగా ఐ ప్యాక్ టీమ్ వ్యూహాలు ఉంటాయి. ఐప్యాక్ ఆదేశాలు లేనిదే వైసీపీ నేతలు అడుగుముందుకు వేయలేరు. సీఎం జగన్ సైతం తనకున్న 151 మంది ఎమ్మెల్యేలు కంటే.. 100 మంది ఐప్యాక్ టీమ్ సభ్యులకే ప్రాధాన్యమిస్తారు. గత ఎన్నికల ముందు వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు వైసీపీకి అక్కరకు వచ్చాయి. అంతులేని విజయాన్ని కట్టబెట్టాయి. ప్రశాంత్ కిశోర్ బిహార్ రాజకీయ బాట పట్టినా.. ఆయన ఐ ప్యాక్ టీమ్ మాత్రం ఇప్పటికీ వైసీపీకి పనిచేస్తోంది. ప్రజల్లోకి బలంగా వెళ్లి వారిని వైసీపీ వైపు టర్న్ అయ్యే విధంగా వ్యవహరించడం ఐ ప్యాక్ లక్ష్యం. అయితే అంతులేని ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ సర్కారు వైపు జనాలను మరల్చడం కష్టం కావడంతో.. రాజకీయ ప్రత్యర్థులపై ఐప్యాక్ ప్రతాపం చూపుతోంది. వారిని పలుచన చేయ్యాలన్న ప్రయత్నం చేస్తోంది.

ప్రస్తుతం నారా లోకేష్ యవగళం పేరిట పాదయాత్ర చేస్తున్నసంగతి తెలిసిందే. 4 వేల కిలోమీటర్ల పాటు నడవాలని లోకేష్ డిసైడ్ కాగా.. ఇప్పటికే 2100 కిలోమీటర్లు నడక పూర్తిచేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరిలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే ఈ పాదయాత్రను పలుచన చేయ్యాలన్నది ఐ ప్యాక్ వ్యూహం. కుప్పంలో ప్రారంభం నుంచే యాత్రపై ఐ ప్యాక్ బృందం ఫోకస్ పెట్టింది. తారకరత్న గుండెపోటుపై ప్రచారం, దారిపొడవునా లోకేష్ కు వైసీపీ చేసిన అడ్డంకులు ప్రజలు చేసినట్టు చూపించడం, లోకేష్ వైఫల్య ప్రసంగాలు, జనాలు పలుచగా ఉన్నట్టు చూపడం.. ఇలా ఎన్నిచేయాలో అన్నీ చేసింది. వీరికితోడు వైసీపీ సోషల్ మీడియా బృందం, లోకేష్ యాత్రను కావాలనే చెడగొట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా విభాగం దాదాపు 1000 మందిని భర్తీ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ప్రారంభంలో చూపిన అల్లరి ఇటీవల తగ్గుముఖం పట్టింది. పాదయాత్ర ప్రశాంతంగా జరుగుతోంది. ఇటువంటి తరుణంలో కనిగిరిలో జరుగుతున్న యాత్రలో అనుమానాస్పదంగా కొత్తముఖాలు కనిపించాయి. దీంతో టీడీపీ శ్రేణులు వారిని గుర్తించారు. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారంటూ నిలదీశారు. సరైన సమాధానం చెప్పలేక కొందరు అక్కడ నుంచి వెనుదిరిగారు. ఇద్దరు మాత్రం పట్టుబడ్డారు. ఆరాతీస్తే తాము ఐ ప్యాక్ టీమ్ సభ్యులమని ఒప్పుకున్నారు. పాదయాత్ర విశేషాలు ఎప్పటికప్పుడు బయటకు చేరవేయడమే వీరి పని. దీనిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైసీపీ వక్రబుద్ధిపై విమర్శలు చేస్తున్నాయి.