Raghu Rama krishnam Raju : కొట్టారు.. వీడియో కాల్ లో చూపించారు.. రఘురామ కేసులో వెలుగులోకి నిజాలు

అప్పట్లో రఘురామకృష్ణంరాజు అరెస్ట్, కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగం సంచలనం సృష్టించాయి. తాజా దర్యాప్తులో అవన్నీ నిజమేనని సిఐడి అధికారులు, సిబ్బంది వాంగ్మూలాలు ఇస్తుండడం విశేషం.

Written By: Dharma, Updated On : September 27, 2024 1:10 pm

Raghu Rama krishnam Raju

Follow us on

Raghu Rama krishnam Raju :  వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణం రాజును సిఐడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేశారు. త్రిముఖ పోటీలో విజయం సాధించారు. అయితే గెలిచిన ఆరునెలలకే వైసీపీ హై కమాండ్ కు దూరమయ్యారు. నాయకత్వంతో విభేదించారు. ఈ క్రమంలో ఆయన పార్టీని వ్యతిరేకిస్తూ కీలక వ్యాఖ్యలు చేసేవారు. మీడియా డిబేట్లో సైతం పాల్గొనేవారు. ఆయనపై అనర్హత వేటు వేసేందుకు వైసిపి ఎంతో ప్రయత్నించింది. కానీ వర్కౌట్ కాలేదు. అందుకే రాజ ద్రహం కేసు నమోదు చేయించింది. సిఐడితో అరెస్టు చేయించింది. ఏకంగా పుట్టినరోజు నాడే హైదరాబాదు నుంచి రఘురామకృష్ణంరాజును గుంటూరు తీసుకొచ్చి వేధించారు అన్నది ప్రధాన ఆరోపణ. తనపై తరుడు డిగ్రీ ప్రయోగించారని స్వయంగా రఘురామకృష్ణంరాజు ఆరోపణలు చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రఘురామకృష్ణంరాజు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో కేసు ఎంతో పురోగతి సాధించింది.

* ఇటీవలే ఫిర్యాదు
ఇటీవల ఈ కేసు విషయంపై రఘురామకృష్ణ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో సిఐడి అధికారులు, సిబ్బంది పాత్ర పై ఆధారాలతో సహా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ఆదేశాలతో ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిఐడి చీఫ్ గా ఉన్న పీవీ సునీల్ కుమార్, మరికొందరు సిబ్బందితో కలిసి రఘురామపై కస్టడీలో ఎలా దాడికి పాల్పడ్డారు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులతో పాటు సాక్షులు కూడా తమ తాజా వాంగ్మూలంలో పలు విషయాలను వెల్లడించారు. అప్పట్లో సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ ఆదేశాలతోనే రఘురామపై కస్టడీలో దాడి చేసినట్లు ఇందులో పాల్గొన్న సీఐడీ పోలీసులు రాజా విచారణలో అంగీకరించారు.

* వీడియో కాల్ లో చూపిస్తూ
అయితే ఈ కేసు విచారణలో అప్పటి సీఐడీ పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కస్టడీలో రఘురామను కొడుతూ వీడియో కాల్ చూపించామని ఒప్పుకున్నారు. అప్పట్లో విధులు నిర్వహించిన సీఐ, ఎస్సై, సిబ్బంది సైతం వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. సిఐడి చీఫ్ తన సిబ్బందితో నేరుగా రఘురామను ఉంచిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వారు వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో అప్పటి సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ పాత్ర పై ఖచ్చితమైన ఆధారాలు దొరికినట్లు అయింది.

* న్యాయస్థానంలో బుకాయింపు
అయితే సిఐడి అధికారులు తనను అరెస్టు చేసి.. విచారణ పేరిట అమానుషంగా ప్రవర్తించారని అప్పట్లో రఘురామకృష్ణంరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ తాము హింసించలేదని కోర్టులో సిఐడి అధికారులు తెలిపారు. దీనిపై అప్పట్లో రఘురామ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు మెడికల్ టీం ను ఏర్పాటు చేసింది. ఆయనకు పరీక్షలు కూడా చేయించింది. ఇందులో రఘురామకృష్ణం రాజు పై దాడి జరిగినట్లు అప్పట్లో నిర్ధారణ అయింది. దానినే ప్రామాణికంగా తీసుకొని రఘురామకృష్ణం రాజుకు ఆ కేసులో బెయిల్ కూడా లభించింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు విచారణ తెరపైకి వచ్చింది. దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయ్ పాల్, అప్పటి జి జి హెచ్ సూపరిండెంట్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి విచారించాలని ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణంరాజు. దీని ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఒక్కోనిజం వెలుగులోకి వస్తోంది.