
న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. పలు కోసుల్లో జరుగుతున్న పరిణామాలతో విశ్వాసం సడలిపోతోంది. న్యాయమూర్తి చెప్పే తీర్పులో సొంత వాక్యాలు రాసి ఆ తీర్పును ఉద్యోగులు విడుదల చేస్తే పరిస్థితి ఏమిటనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఇంతటి సాహసం ఎవరు చేయరు? కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాత్రం ఇలాంటిదే చోటుచేసుకుంది. హైకోర్టులో శంకర్ రెడ్డి, వెంకటరమణ అనే ఉద్యోగులు పని చేస్తున్నారు. వారు కీలక విధుల్లోనే ఉన్నారు.
ఓ కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు అధికారుల్ని తమ ఎదుట హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే అందరూ హాజరయ్యారు. కానీ మురళీధర్ రెడ్డి అనే కలెక్టర్ మాత్రం హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదని న్యాయమూర్తి ప్రశ్నిస్తే మీరే వద్దన్నారుగా అని ఆ కలెక్టర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయమూర్తులకే షాక్ తగిలింది. వెంటనే ఆ కలెక్టర్ మురళీధర్ రెడ్డి తరఫు న్యాయవాదులు తీర్పులోని ఓ అంశాన్ని చూపించారు.
ఉత్తర్వులు అమలు చేసినట్లయితే కలెక్టర్ కోర్టు ఎదుట హాజరు కానవసరం లేదని ఆ తీర్పులో ఉంది. ఆ తీర్పును తాము ఎప్పుడు చెప్పామని న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. వెంటనే ఏం జరిగిందో తెలుసుకోవాలని అంతర్గత విచారణకు ఆదేశించారు. విచారణలో శంకర్ రెడ్డి, వెంకటరమణ అనే ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా న్యాయమూర్తి తీర్పులో కలెక్టర్ హాజరు కానవసరం లేదనే వాక్యాలు చేర్చినట్లు తేలింది.
దీంతో వారిపై చర్యలకు హైకోర్టు సిద్ధమైంది. న్యాయమూర్తి తీర్పుకే కొత్త అర్థం చెప్పడం, చెప్పని మాటల్ని చెప్పినట్లుగా తీర్పులో రాసి రిలీజ్ చేయడం అంటే చిన్న నేరం కాదు. ఇక్కడ శంకర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోసమే ఆ పని చేశారు. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే న్యాయవ్యవస్థపై కొంత మంది రకరకాల ఒత్తిళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ రకమైన ఆరోపణలు రావడం గమనార్హం. తీర్పులు కూడా మ్యానిపుటేట్ చేసే ఉద్యోగులు హైకోర్టులో తయారవడం అందరిని కలచివేస్తోంది.