Vijayasai Reddy :  పెద్ద సాహసమే చేసిన విజయసాయిరెడ్డి.. జగన్ పక్కన పెట్టడానికి రీజన్ అదే

ఇటీవల నేతలు పార్టీ మారడం సాధారణ ప్రక్రియ గా సాగింది. ఓడిన పార్టీల నుంచి గెలిచిన పార్టీల్లోకి ప్రజా ప్రతినిధులు చేరిపోతున్నారు. కానీ కీలక నేతలు సైతం ఉన్నపలంగా పార్టీని వీడి ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారు. ఇప్పుడు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి విషయంలో కూడా అదే ప్రచారం నడుస్తోంది.

Written By: Dharma, Updated On : September 27, 2024 2:16 pm

Vijayasai Reddy

Follow us on

Vijayasai Reddy : విజయసాయి రెడ్డి పార్టీ మారడానికి ప్రయత్నించారా? వైసీపీని వీడేందుకు సిద్ధపడ్డారా? అందుకే జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదా? దాదాపు పక్కన పెట్టారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. విజయసాయిరెడ్డి టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి టిడిపి వైపు రావడానికి కారణం ఏంటి అనేది చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన వచ్చిన టిడిపి తీసుకునే అవకాశం ఉందా? టిడిపి నుంచి సానుకూలత సంకేతాలు వెళ్లడంతోనే ఆయన స్పందించి ఉంటారని చర్చ కూడా జరుగుతోంది. అయితే టిడిపిలోనే ఉన్నత వ్యక్తుల ద్వారా ఈ ప్రక్రియ జరిగినట్లు సమాచారం. మరోసారి రాజ్యసభ పదవిని రెన్యువల్ చేస్తే తాను పార్టీ మారేందుకు సిద్ధమని విజయసాయిరెడ్డి నుంచి సంకేతాలు వచ్చినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే విజయసాయిరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావించిన టిడిపి నాయకత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం. అదే సమయంలో విజయసాయిరెడ్డి బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కానీ రాజ్యసభ పదవి వదులుకుంటేనే పార్టీలో చేర్చుకుంటామని బిజెపి షరతు పెట్టినట్లు సమాచారం. అయితే అదే జరిగితే అదే రాజ్యసభ పదవి టిడిపి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో విజయసాయిరెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలియడంతోనే జగన్ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

* రాజకీయాల్లోకి రాక ముందే
జగన్ పొలిటికల్ ఎంట్రీ కి ముందే విజయసాయిరెడ్డి ఆయనను అనుసరిస్తున్నారు. వృత్తిరీత్యా ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా మారారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా సిబిఐ కేసు నమోదు చేయడంతో 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. జగన్ వైసీపీని ఏర్పాటు చేయడంతో..అక్కడ కూడా జగన్ వెంట ఉండేవారు. పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. వైసీపీ అధికారంలోకి రావడంతో తిరుగులేని అధికారాన్ని వెలగబెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం చవిచూసింది. అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్న విజయసాయిరెడ్డి ఇబ్బందుల్లో పడ్డారు. పార్టీలో ఉంటే తనకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. పైగా జగన్ ప్రాధాన్యత తగ్గడంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. పార్టీ మారేందుకు సిద్ధపడ్డారని వార్తలు వస్తున్నాయి.

* ఓ రకమైన అనుమానం
తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబును దారుణంగా దూషించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకానొక దశలో వైసీపీలో ఆయనపై అనుమానాలు పెరిగాయి. సినీ నటుడు తారకరత్న మృతి సమయంలో చంద్రబాబుతో విజయసాయిరెడ్డి తరచూ కలిసేవారు. చంద్రబాబు మేనల్లుడు తారకరత్న కాగా.. ఆయన భార్య విజయసాయి రెడ్డికి సమీప బంధువు. స్వయాన మరదలు కుమార్తె. లోకేష్ యువగలం పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యారు తారకరత్న. ఆయన అకాల మరణంతో ఇరు కుటుంబాల పెద్దలుగా చంద్రబాబు, విజయసాయిరెడ్డి వ్యవహరించారు. చంద్రబాబుతో విజయసాయిరెడ్డి చనువుగా గడిపేవారు. అప్పట్లో కూడా విజయసాయిరెడ్డి పై వైసీపీలో అనుమానాలు పెరిగాయి.

* జగన్ కు అందిన సమాచారం
అయితే తాజాగా మంత్రి అచ్చన్న విజయసాయిరెడ్డి విషయం బయటపెట్టారు. దీంతో ఆయనపై ఫైర్ అయ్యారు విజయసాయి. కానీ ఇప్పటికే జగన్ కు విజయసాయిరెడ్డి విషయంలో సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అసలు విజయసాయిరెడ్డి పార్టీ మారాలనుకున్నా.. ఏ పార్టీ కూడా తీసుకునే ఉద్దేశం లేదు. వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగే క్రమంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులపై అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థికి మించి శత్రువుగా మారిపోయారు. అందుకే ఆయన ఏ పార్టీలో చేరలేరని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.