Notices to Resigned YCP MLCs: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీల విషయంలో ఏ నిర్ణయము ప్రకటించలేదు మండలి చైర్మన్. ఏడాది కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓ ఆరుగురు వరకు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే తాము మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నామని మండలి చైర్మన్ ఫార్మేట్ లోనే వారు తమ లేఖలను ఇచ్చారు. కానీ మండలి చైర్మన్ మోసేన్ రాజు మాత్రం వాటిని ఆమోదించలేదు. అయితే ఇప్పుడు దీనిపై రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు న్యాయ పోరాటం చేయడంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి మండల చైర్మన్ కు ఏర్పడింది. కోర్టు ఆదేశాల మేరకు రేపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయ మంగళం వెంకటరమణ నుంచి వివరణ తీసుకోనున్నారు చైర్మన్. మిగతా ఎమ్మెల్సీల విషయం ఈనెల 26న విచారణ చేపట్టనున్నారు. అయితే ఈసారి కోర్టు ఆదేశాలు సీరియస్ గా ఉంటాయని భావించి.. వారి రాజీనామాలపై మండలి చైర్మన్ ఒక నిర్ణయానికి వస్తారని ప్రచారం నడుస్తోంది.
పార్టీతో పాటు పదవులకు గుడ్ బై..
2024 ఎన్నికల ఫలితాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి చెందిన పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, జయ మంగళం వెంకటరమణ, మరి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇందులో పోతుల సునీత బిజెపిలో చేరారు. జయ మంగళం వెంకటరమణ మాత్రం జనసేన గూటికి చేరారు. మిగతా ముగ్గురు టిడిపిలో చేరిపోయారు. అయితే పార్టీకి వీరు రాజీనామా చేసి ఏడాది దాటుతోంది. కానీ శాసనమండలి చైర్మన్ వీరి రాజీనామాలను ఆమోదించలేదు. వీరి రాజీనామాలను ఆమోదిస్తే ఈ ఎమ్మెల్సీ పదవులన్నీ కూటమి ఖాతాలో చేరిపోతాయి. మండలిలో కూటమి బలం పెరుగుతుంది. ఆ కారణం చేతనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మండలి చైర్మన్ రాజీనామాలను ఆమోదించలేదు.
హైకోర్టును ఆశ్రయించడంతో..
ఇందులో జయ మంగళం వెంకటరమణ అయితే తన రాజీనామాను ఆమోదించడం లేదని ఏకంగా హైకోర్టు తలుపు తట్టారు. తక్షణం పరిశీలన చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ కు కోర్టు ఆదేశించింది. ఈ తరుణంలో రేపు వ్యక్తిగతంగా హాజరుకావాలని జయ మంగళం వెంకటరమణ ను మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత రోజు మిగతా ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అయితే వీరి రాజీనామాల ఆమోదం విషయంలో కోర్టు సీరియస్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే వారు శాసనమండలి చైర్మన్ ఫార్మాట్లో, మనస్ఫూర్తిగా రాజీనామా చేసినట్లు రాజీనామా లేఖల్లో పేర్కొన్నారు. అయితే రాజకీయ కోణంలోనే మండలి చైర్మన్ ఆలోచించి ఆమోదించడం లేదని.. ఈ ఎమ్మెల్సీలు అంతా తమ వాదనలు వినిపిస్తే మాత్రం ఇబ్బంది కరం. అందుకే మండలి చైర్మన్ వీరిని పిలిపించి ఏదో ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. రాజీనామాలను ఆమోదించినా.. ఆమోదించకపోయినా అది సంచలన అంశంగానే మిగలనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..