CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబుపై( CM Chandrababu) అనేక రకాల విమర్శలు ఉండేవి. ఆయన కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వరని… బంధుత్వాలను పక్కన పెడతారని.. అలా చేస్తే మరో రాజకీయ కేంద్రంగా మారుతారని భావిస్తారని.. ఇలా ఎన్నెన్నో ప్రచారాలు ఉండేవి. నందమూరి కుటుంబాన్ని తొక్కేసి ఎదిగారని కూడా ఆరోపణలు ఉండేవి. అయితే క్రమేపీ ఆరోపణలన్నీ కరిగిపోతున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. తాజాగా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఆత్మీయ ఆలింగనం చేసుకుని దగ్గర చేర్చుకున్నారు చంద్రబాబు. తెలుగు నాట ఈ ఇద్దరు తోడల్లుళ్లు మధ్య జరిగిన పొలిటికల్ ఫైట్ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబును విభేదించే దగ్గుబాటి తనకు తానుగా దగ్గరయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Also Read : చంద్రబాబు, దగ్గుబాటి కలయిక సామాన్యులకు గొప్ప పాఠం.. పార్టీల కార్యకర్తలకు గుణపాఠం..
* అప్పట్లో ఐక్యత
1995లో టిడిపి( Telugu Desam Party) సంక్షోభ సమయంలో చంద్రబాబుతో పాటు దగ్గుబాటి కలిసి ఉండేవారు. చంద్రబాబు సీఎంగా, వెంకటేశ్వరరావు మంత్రిగా ఉండేవారు. కార్యక్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వెంకటేశ్వరరావు చంద్రబాబు అంటేనే మండిపడే వారని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి వెంకటేశ్వరరావు అదే చంద్రబాబును ఆశ్రయించారు. తమ మధ్య గ్యాప్ ఉండేదని చెప్పుకున్నారు. కానీ కుటుంబం అంటే కలిసిపోవాలి కదా అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అటు దగ్గుబాటి పురందేశ్వరి సైతం తన చెల్లెలి భర్త విషయంలో గౌరవంగానే ఉంటున్నారు.
* చంద్రబాబును నమ్మిన నందమూరి కుటుంబం
ఆది నుంచి నందమూరి కుటుంబం( Nandamuri family) చంద్రబాబు పట్ల గౌరవభావంతోనే ఉంది. టిడిపిలో సంక్షోభ సమయంలో చంద్రబాబు చేసిన పనికి వెన్నుపోటు అన్నారు. కానీ ఉమ్మడి ఏపీ ప్రజలు ఆశీర్వదించారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు సైతం నమ్మకం పెట్టుకున్నారు. అదే సమయంలో నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ బతికున్నంత వరకు బావ చంద్రబాబు తోనే కొనసాగారు. మధ్యలో విభేదించి వెళ్లిపోయిన హరికృష్ణ ను చేరదీసి రాజ్యసభ పదవి ఇచ్చారు. బాలకృష్ణ ద్వారా నందమూరి కుటుంబాన్ని ఐక్యం చేసి తన వైపు తిప్పుకోగలిగారు. దశాబ్దాలుగా వైరంతో ఉన్న తోడల్లుడు దగ్గుబాటి కుటుంబాన్ని సైతం చేరదీయగలిగారు.
* జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్న చెల్లెల్లు
అయితే చంద్రబాబు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)ఆ విధంగా చేరదీయగలరా? అనే ప్రశ్న వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విభేదించారు సోదరి షర్మిల. ముందుగా వ్యక్తిగతంగా సోదరుడికి దూరమయ్యారు. తరువాత రాజకీయంగా రూటు మార్చారు. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు. మరోవైపు బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నారు. తన తండ్రి హత్య విషయంలో నేరుగా జగన్మోహన్ రెడ్డిని నిందిస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ.. కుమారుడు కంటే కుమార్తెకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు మాదిరిగా ఇంట గెలిచే ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదు. దానికి మరికొంత సమయం పట్టే పరిస్థితి ఉంది.
Also Read : షర్మిల ట్రాప్ లో విజయమ్మ.. జగన్ సంచలన కామెంట్స్!