Chiranjeevi Controversy Comments: తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన నోటి నుంచి వచ్చిన కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అనవసరంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారా? అని అనిపించేలా ఉన్నాయి. ఆయనకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఇచ్చారు. అయితే చిరంజీవి నందమూరి తారక రామారావు గురించి ఒక్క ప్రస్తావన కూడా చేయలేదు. ఆయన పేరుతో అవార్డు తీసుకున్నందుకు ఒకటి రెండు మాటలు అయినా చెప్పి ఉండాల్సింది. కానీ ఎందుకో చిరంజీవి ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురాలేదు. సహజంగానే ఏదైనా అవార్డులు ఎవరి పేరు మీద అయినా తీసుకుంటే వారి గురించి ప్రస్తావించడం అనేది ముఖ్యం. కానీ ఎందుకో చిరంజీవి ఆ విషయంలో పొరపాటు చేసినట్టు కనిపించారు. అయితే వెంటనే దానిని సరిదిద్దుకున్నారు. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడం పై ట్వీట్ చేశారు. ఆయన పేరుతో అవార్డు తీసుకోవడం పై ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!
* పక్క రాష్ట్రం అంటూ కామెంట్..
అయితే అదే వేదికపై పక్క రాష్ట్రం అని ఏపీని ( Andhra Pradesh) ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆంధ్రప్రదేశ్ను పక్క రాష్ట్రం తో పోల్చడం ఏమిటని విమర్శలు వచ్చాయి. తెలంగాణ వేదికగా ఏపీ పక్క రాష్ట్రం కావచ్చు కానీ.. సాటి తెలుగు రాష్ట్రం. అందున సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా ఆ మాట అనకూడదు. మరోవైపు కళారంగాన్ని ఆదరించడం, సినీ పరిశ్రమను ప్రోత్సహించడంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉందని చిరంజీవి వ్యాఖ్యానించారు. అంటే నంది అవార్డులను ఇవ్వాలన్నది చిరంజీవి అభిమతం గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి..
* అనవసరంగా చంద్రబాబు ప్రస్తావన..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Telangana CM Revanth Reddy ) పక్కన ఉండగానే ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు చిరంజీవి. నంది అవార్డులను పునరుద్ధరించే విషయంలో చంద్రబాబు ఒక ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా చంద్రబాబు నంది అవార్డులను నిలిపివేశారన్న అభిప్రాయం వచ్చేలా చిరంజీవి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ అభిప్రాయం తీసుకుంటూ వస్తుందనలో సందేహం లేదు. అందులోనూ సినీ పరిశ్రమకు సంబంధించిన పూర్తి వ్యవహారాలన్నీ పవన్ కళ్యాణ్ చూస్తారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేనకు చెందిన కందుల దుర్గేష్ ఉన్నారు. ఆ ఇద్దరికీ చెబితే ఇట్టే పని జరిగిపోతుంది. కానీ చిరంజీవి మాత్రం చంద్రబాబు ప్రస్తావన తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. అనవసరంగా చంద్రబాబును ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఏమిటనేది ఒక ప్రశ్న.
* నంది అవార్డులను నిలిపివేసింది జగన్
పైగా ఏపీలో నంది అవార్డులను నిలిపివేసింది జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). వాస్తవానికి తెలుగుదేశం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నంది అవార్డులను ఇచ్చింది. అయితే 2017లో మొత్తం నాలుగు సంవత్సరాలకు సంబంధించి అవార్డులను ప్రదానం చేశారు. కానీ ఆ సమయంలో సొంతవారికి అవార్డులు ఇచ్చుకున్నారు అన్న విమర్శలు వచ్చాయి. ఇదే సినీ పరిశ్రమకు చెందిన చాలామంది వ్యక్తులు విమర్శలు చేశారు.. అటు తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నంది అవార్డులను పూర్తిగా ఇవ్వలేదు. కానీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కనీసం నోరు తెరవలేదు. పోనీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఎవరు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవలేదు. అటువంటప్పుడు నంది అవార్డుల విషయంలో చిరంజీవి ప్రత్యేకంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని చిన్నచూపు చూసి మాట్లాడడం ఏమిటనేది ప్రశ్న.
* తెలంగాణ పై అభిమానం..
అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం విషయంలో సినీ పరిశ్రమ ఒకలా ఉంటుంది. ఏపీ ప్రభుత్వం విషయంలో మరోలా వ్యవహరిస్తోంది. ఎందుకంటే తెలంగాణలో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల ఆస్తులు, పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వారి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం విషయంలో భయము ఉంటుంది. కానీ ఏపీ మాత్రం కేవలం ప్రేక్షక వర్గానితోపాటు వీక్షక వర్గానికి మాత్రమే పరిమితం అయింది. కేవలం ఆదాయం ఇస్తుందే తప్ప సినీ పరిశ్రమ పెద్దలకు ఇక్కడ ఆస్తులు లేవు. అందుకే ఏపీ ప్రభుత్వం పై నోరు మెదిపే సినీ పరిశ్రమ వ్యక్తులు.. తెలంగాణ ప్రభుత్వం పై మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. అయితే చిరంజీవి చివరిగా ఒక మాట చెప్పారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తేనే జీడీపీ పెరుగుతుందనేది చిరంజీవి వాదన. కానీ ఒక చిన్న పరిశ్రమ ఏడాది లావాదేవీలకు కూడా చిత్ర పరిశ్రమ సాటి రాదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వేలాదిమందికి ఉపాధినిస్తుంది ఓకే. సంప్రదాయ సాంస్కృతిక రంగం సినిమా. అంతవరకు ఓకే కానీ.. రాష్ట్ర అభివృద్ధిలో కీలకం అన్న విషయం మాత్రం ఉత్తమాటే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ ఒక్కటే. నంది అవార్డుల పేరిట ఉన్న దానిని మార్చి గద్దర్ పేరిట ఇస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ఏపీ ప్రభుత్వం ఇస్తే ఆ అవార్డులకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. బహుశా ఏపీ ప్రభుత్వం ఆ ఆలోచనతోనే నంది అవార్డులను పునరుద్ధరించలేదు. కానీ చిరంజీవి వేదికపై యధాలపంగా మాట్లాడిన వ్యాఖ్యలు ఇంతటి దుమారానికి దారి తీయడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
