Missing Child Case: చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ వీడడం లేదు. పది రోజులు అవుతున్నా చిన్నారి ఆచూకీ లభించలేదు. వందలాదిమంది పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఈ కేసులో కీలకమైన పెంపుడు కుక్క సైతం మృతి చెందింది. దాని పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత నేరుగా ఈ ఘటనపై పర్యవేక్షణ చేపట్టి.. ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 30 మంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందిని నాలుగు ప్రత్యేక బృందాలుగా విభజించి.. చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. వీరితో పాటు 150 మందికి పైగా పోలీసులు పది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగింది. అయినా సరే చిన్న క్లూ కూడా దొరకడం లేదు.
* కుక్క మరణించడంతో..
ఆ చిన్నారితో పాటు వారి పెంపుడు కుక్క కూడా మృతి చెందింది. దీంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదృశ్యమైన రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క పోలీసులతో పాటు స్థానికులను చూసి భయపడి వెళ్ళిపోయింది. మరుసటి రోజు తిరిగి వచ్చిన తర్వాత కుక్క మెడకు జిపిఎస్ ట్రాకర్ బిగించి.. అది తిరిగే ప్రాంతాలను గుర్తించారు. దాదాపు పది కిలోమీటర్లు తిరిగిన తర్వాత కుక్క అస్వస్థతకు గురై మరణించింది.. పెంపుడు కుక్క మృతి పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అందుకే పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. కుక్క శివ పరీక్షను చేపట్టి శరీర భాగాల నమూనాలను సేకరించారు. విశాఖ ల్యాబ్ కు తరలించారు . పోస్టుమార్టం నివేదికతో పాటు ల్యాబ్ ఫలితాలు దర్యాప్తులో కొత్త సమాచారం వెలుగులోకి తెచ్చే అవకాశం ఉందని అధికారులు ఒక ఒక అంచనా తో ఉన్నారు.
* అటవీ జంతువులపై అనుమానం..
మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి అటవీ జంతువుల బారిన పడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొండచిలువు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అనుమానిస్తున్నారు. అందుకే చిన్నారి దుస్తులు సహా ఆనవాళ్లు సైతం కనిపించకుండా పోయాయని భావిస్తున్నారు పోలీసులు. అటవీ శాఖ అధికారులు మాత్రం దీనితో విభేదిస్తున్నారు. ఈ ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాలు, వన్యప్రాణులు దాడి చేసిన దాఖలాలు లేవని చెబుతున్నారు. దీంతో జ్ఞానేశ్వరి అదృశ్యంపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కేసును. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గ వద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్దిష్టమైన ఆనవాళ్లు ఏవీ లభించకపోవడంతో పోలీసులు సైతం ఏ నిర్ధారణకు రాలేకపోతున్నారు.
