AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత రెండు సంవత్సరాలుగా ఆ పార్టీ పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆ పార్టీలో పెద్దగా చేరికలు లేవు. చేరిన వారు సైలెంట్ గా ఉన్నారు. పాత నేతలు వ్యూహాత్మక సైలెన్స్ పాటిస్తున్నారు. పొత్తులో భాగంగా పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పని తాను చేసుకుంటున్నారు. ఎందుకో పార్టీని అభివృద్ధి చేసే ఆలోచన ఆ పార్టీ నేతల్లో కనిపించడం లేదు. ఏపీ విషయంలో హై కమాండ్ సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు.
* పెరిగిన బలం..
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక రాష్ట్ర మంత్రి ఉన్నారు. ఒక కేంద్రమంత్రి కొనసాగుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ముద్ర చూపలేకపోతోంది ఏపీలో. కనీస స్థాయిలో చురుకైన పార్టీ కార్యక్రమాలు కూడా లేవు. అదే తెలంగాణలో అయితే నిత్యం బిజెపి పెద్దల పర్యటనలు, ప్రభుత్వ వైఫల్యాలపై కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఏపీలో అది సాధ్యం కాదు. ఎందుకంటే బిజెపి ఇక్కడ మిత్రపక్షం. అయితే పార్టీ పరంగా కూడా యాక్టివ్గా కార్యక్రమాలు లేవు. ఇతర పార్టీల నుంచి చేరికలు లేవు. ఫలితంగా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో పుంజుకోలేకపోతోంది.
* మాధవ్ వచ్చిన తర్వాత..
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పివిఎన్ మాధవ్ వ్యవహరిస్తున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్నాక పార్టీ మరింత పుంజుకుంటుందని అంచనా వేశారు. కానీ ఎందుకో అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్లలేకపోతోంది. పార్టీ బాధ్యతలు తీసుకున్న కొత్తలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధపడ్డారు మాధవ్. తరువాత చురుకుదనం తగ్గింది. కేవలం కూటమితో ముందుకు వెళ్లడమే తప్పించి.. స్వతంత్రంగా ఏపీలో పార్టీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కనీసం బిజెపి ఉనికి చాటుకుంటుందా? లేదా అన్నది అనుమానమే. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కూడా స్థానిక నాయకత్వం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. అయితే భారీగా చేరికలు ఉంటాయని అప్పట్లో అంచనాలు ఉండేవి. కానీ ఎందుకో ఇప్పటికే చేరిన వారు యాక్టివ్ గా లేరు. అందుకే కొత్తగా ఎవరూ ముందుకు రావడం లేదు. మరి ఏపీ విషయంలో బిజెపి ఆలోచన ఏంటో ఇంతవరకు తెలియడం లేదు. ఇలా అయితే ఆ పార్టీకి కష్టమే?


