YS Jagan Mohan Reddy: ప్రపంచంలో ఏ తప్పు జరిగినా అది చంద్రబాబుది అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి తీరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీని మెటా సంస్థ నిలిపివేసింది. దీంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్ద గగ్గులు పెడుతోంది. మా గొంతు నొక్కేస్తున్నారు అంటూ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి నేతల వరకు ఒకటే ఏడుపు. ప్రజాస్వామ్య కూని జరిగిందని జగన్ ఆరోపిస్తూ సుదీర్ఘంగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశారు. అందులో భారత ప్రభుత్వం నుంచి వచ్చిన చట్టపరమైన ఫిర్యాదులు, నిబంధనల ఉల్లంఘనలతో ఈ పేజీని నిలిపి వేశాం అని స్పష్టంగా మెటా సంస్థ రాసుకొచ్చింది. అయినా సరే అదే పనిగా చంద్రబాబును నిందించారు జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ నేతలు.
* దేశం ఫిర్యాదుతోనే..
సోషల్ మీడియా అకౌంట్ కు సంబంధించి దేశానికి తప్పకుండా ఒక బాధ్యత ఉంటుంది. అసభ్య పదజాలాలు అశ్లీలతో కూడిన పోస్టులు ఉంటే కచ్చితంగా మెటా నిషేధిస్తుంది. పైగా అది ఒక రాజకీయ పార్టీకి చెందిన అధికారిక ఫేస్బుక్ అకౌంట్ పేజీ. కచ్చితంగా సమాజం పై ప్రభావం చూపుతుంది. అటువంటి దాని విషయంలో సోషల్ మీడియా నిర్వహణను చూస్తే మెటా లాంటి సంస్థ నిఘా పెడుతుంది. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఫేస్బుక్ అకౌంట్ పేజీ నిలిపివేతకు కారణం చెప్పింది మెటా. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ ఐటీ నిబంధనల ప్రకారం వైసీపీ పేజీని బ్యాన్ చేసిందని కళ్ళముందే అక్షరాలు కనిపిస్తున్నా.. జగన్ మాత్రం ఢిల్లీ వైపు చూసి ఒక్క మాట అనడం లేదు. దానికి కారణం కేసుల భయం అన్నది చిన్నపిల్లాడిని అడిగిన ఇట్టే చెప్పేస్తాడు.
* కేంద్రం చేసిందని తెలుసు..
ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేసినట్టు.. అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేగలదా? కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన దెబ్బ కొట్టింది. దానిపై కేంద్రాన్ని నిలదీయాలి. అయితే అంత ధైర్యం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎందుకంటే అంత సీన్ లేదు కూడా. ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో కేంద్రం నుంచి రియాక్షన్ జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. అందుకే చంద్రబాబు నమ్ముకున్నారు. చంద్రబాబుపై ఒక విమర్శ చేసి క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాక్రోచ్ జనతా పార్టీతో పోల్చుకున్నారు. అంటే అదేదో గొప్పతనంగా చెప్పుకున్నారు కానీ. అది కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రూపొందించింది అనే విషయాన్ని మరిచిపోయి కాక్రోచ్ తో పోల్చారు. అలా పోల్చిన 24 గంటల్లోనే సోషల్ మీడియా ఫేస్బుక్ పేజీ నిలిచిపోయింది. డిజిటల్ కంటెంట్ పేరుతో సమాజంలో అశాంతి రేపుతున్నారంటూ కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిన నివేదికల ఆధారంగానే ఆ యాక్షన్ జరిగింది. ఇంత ఘోరంగా తమను బిజెపిని టార్గెట్ చేస్తోందని… తమ డిజిటల్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తుందని తెలిసినా కనీసం ఎక్స్ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితి జగన్మోహన్ రెడ్డి.
