CM Chandrababu Delhi Tour : కేంద్రంలో ఈసారి చంద్రబాబు పాత్ర పెరిగింది.గత ఐదేళ్లుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అధికారానికి దూరం కాగా..కేంద్రంలో కూడా పరపతి తగ్గింది. అటు బిజెపి అగ్రనేతలు పట్టించుకోలేదు. వారిని కాదని ఇతర జాతీయ పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకోలేదు చంద్రబాబు. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా చంద్రబాబు ఇమేజ్ పెరిగింది. రాష్ట్రంలో ఒంటరిగానే టిడిపి 134 అసెంబ్లీ స్థానాలను సాధించింది. కూటమిపరంగా 164 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 16 ఎంపీ సీట్లలో గెలిచింది. కూటమిపరంగా 21 సీట్లతో సత్తా చాటింది. అయితే గత రెండుసార్లు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ సొంతంగానే అధికారంలోకి రాగలిగింది. కానీ ఈసారి మెజారిటీకి అల్లంతా దూరంలో నిలిచిపోయింది బిజెపి బలం. సరిగ్గా అటువంటి సమయంలోనే నేనున్నాను అంటూ చంద్రబాబు ఎన్డీఏ ఊపిరిలూదారు.మూడోసారి ఎన్డీఏ సుస్థిరతకు చంద్రబాబు అవసరం అనివార్యంగా మారింది. దీంతో చంద్రబాబు ఇమేజ్ అమాంతం పెరిగింది. కేంద్ర ప్రభుత్వంలో టిడిపి చేరింది. టిడిపి కూటమి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామ్యం అయ్యింది. అయితే చంద్రబాబు ఇక్కడే ఒక ఎత్తుగడ వేశారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ కేంద్రం సాయాన్ని పొందేలా పక్కాగా ప్లాన్ చేశారు. అందులో భాగంగానేఅమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం దొరికింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం నిధుల కేటాయింపు జరిగింది. ఈ ఐదేళ్లపాటు ఇలానే సాఫీగా వెళ్లిపోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీలైనంత వరకు భారీగా కేంద్రం నుంచి నిధులు సమీకరణ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్న ప్రతిసారి రాష్ట్రానికి ఏదో ఒక ప్రయోజనందక్కుతూ వస్తోంది.ఈ తరుణంలో ఈ నెల ఏడున చంద్రబాబు ఢిల్లీ వెళ్ళనున్నారు. దీంతో కేంద్ర సాయం పై ఇప్పుడే చర్చ ప్రారంభం అయ్యింది.
* రెండు రోజులపాటు ఢిల్లీలోనే
చంద్రబాబు రెండు రోజులు పాటు ఢిల్లీలో ఉండనున్నారు. ఈనెల 7న ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 8వ తేదీ సాయంత్రం తిరిగి అమరావతికి వస్తారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా విశాఖ ఉక్కు పై కేంద్ర ఆర్థిక, ఉక్కు శాఖల మంత్రుల ఆధ్వర్యంలో జరిగే కీలక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అవుతారని తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీకి రావలసిన కీలక ప్రాజెక్టులతోపాటు అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణం పై వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
* రైల్వే జోన్ కు శంకుస్థాపన
మరోవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను చంద్రబాబు కలిసి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆమోద ముద్ర వేసిన విషయం విధితమే. విశాఖ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తం పై రైల్వే శాఖ మంత్రి తో చర్చించబోతున్నట్లు సమాచారం. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరం అంశం పైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి వరద సాయంతో పాటు ఇతర కేంద్ర ప్రాజెక్టులు, ఏపీకి సంబంధించిన ముఖ్య అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం చర్చిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More