Chandrababu Naidu: మంత్రాలకు చింతకాయలు రాలవు.. ఇది బాబు గారి హైటెక్ మంత్ర

వెనుకటి రోజుల్లో రాజకీయ నాయకుల వ్యవహార శైలి విభిన్నంగా ఉండేది. కొంతమంది రాజకీయ నాయకులు బంగారు కడియాలు ధరించేవారు. ఇంకా కొంతమంది పంచ కట్టులో దర్శనమిచ్చేవారు. ఒక్కొక్కరు ఒక్కో తీరైన ఆహార్యాన్ని ప్రదర్శించేవారు. ఇప్పుడు కాలం మారింది కాబట్టి హైటెక్ విధానాలను అనుసరిస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 23, 2024 9:57 pm

Chandrababu Naidu

Follow us on

Chandrababu Naidu: మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే రాజకీయ నాయకులలో చంద్రబాబు నాయుడు ముందుంటారు.. ఆయన ఒకే తీరైన దుస్తులను ధరిస్తుంటారు. గోధుమ, పసుపు రంగు కలబోసిన దుస్తులను ఆయన వేసుకుంటూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రి ఆయన నాటి నుంచి నేటి వరకు అదే తరహా దుస్తులలో కనిపిస్తుంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తుడైనప్పటికీ.. తీసుకునే ఆహారంలో సమతౌల్యాన్ని పాటిస్తారు. అందువల్లే చంద్రబాబు ఏడుపదులకు మించిన వయసులోనూ అదే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఊపిరి సలపని షెడ్యూల్ లోనూ ఆయన ప్రచారం నిర్వహించారు. చెమట పడుతున్నప్పటికీ.. ఏ మాత్రం ఇబ్బంది పడకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వస్తున్నా మీకోసం అనే పేరుతో పాదయాత్ర కూడా నిర్వహించారు. తీసుకునే ఆహార విషయంలో చంద్రబాబు నాయుడు కఠినమైన నిబంధనలను పాటిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చక్కర జోలికి వెళ్లరు. తీపి పదార్థాలను అసలు ముట్టరు. అన్నాన్ని ఏమాత్రం తినరు. ఆయన అన్నం మానేసి చాలా సంవత్సరాలు దాటిపోయిందని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో నారా భువనేశ్వరి తెలిపారు.

ముందుగానే చెప్పినట్టు హైటెక్ విధానాలను అవలంబించడంలో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. శుక్రవారం వానపల్లి గ్రామంలో నిర్వహించిన ఓ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు..సెల్ ఫోన్, సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..” నా వేలికి ఉన్న ఉంగరాన్ని చూశారా.. ఇది మంత్రాలు వేసి చేసిన ఉంగరం కాదు. ఏవేవో రాళ్లతో రూపొందించిన ఉంగరం అంతకన్నా కాదు. ఇది పూర్తి హైటెక్ రింగ్. నేను రాత్రి ఎంతసేపు పడుకున్నాను? నా శరీరం ఎంత మేరకు సహకరించగలదు? తీసుకునే ఆహారం ద్వారా ఎన్ని కేలరీలు నా శరీరంలోకి చేరాయి? అవి ఎంత మేర ఖర్చయ్యాయి? నా హృదయస్పందన ఎలా ఉంది? నా రక్తపోటు అదుపులో ఉందా?. ఇంకా ఏవైనా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందా? ఇలాంటి విషయాలను ఈ రింగ్ ద్వారా తెలుసుకోవచ్చని” చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇందులో సెన్సార్ ఉండడం ద్వారా ప్రతిదీ తెలుస్తుందని ప్రకటించారు. నా వేలికి ఉన్నది మంత్రాల రింగు కాదు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీస్తున్నాయి. అయితే హైటెక్ ఉపకరణాలను చంద్రబాబు వాడటం ఇదే తొలిసారి కాదు.. గతంలో ఆయన ప్రత్యేకమైన షూస్ ధరించేవారు. అవి అరికాళ్ళల పై ఒక రకమైన ఒత్తిడి కలిగించి, రక్తపోటును అదుపులో ఉంచేవి. ఆయన అప్పుడప్పుడు ధరించే కళ్ళజోడు కూడా హైటెక్ తరహాదే. దానివల్ల ఎంతసేపు మేల్కొని పుస్తకాలు లేదా, డాక్యుమెంట్లను పరిశీలించినప్పుడు కళ్లకు ఏమాత్రం అలసట కలగదు.