CM Chandrababu: అమరావతి పై చంద్రబాబు మాస్టర్ ప్లాన్

అమరావతి రాజధాని నిర్మాణాన్ని.. 9 జోన్లుగా విభజించారు. 9 నగరాలు నిర్మించాలన్నది లక్ష్యం. అందుకు జీవో కూడా ఇచ్చారు. అయితే ఈ జోన్లలో.. ఆర్ 5 జోన్ కీలకం.

Written By: Dharma, Updated On : July 4, 2024 3:16 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని శరవేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. మాస్టర్ ప్లాన్ తో దూసుకుపోయేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అన్ని రకాల అడ్డంకులను అధిగమించి అమరావతి రాజధాని నిర్మాణాన్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా జగన్ హయాంలో వచ్చిన ఆర్ 5 జోన్ ను రద్దు చేయనున్నారు. చంద్రబాబు దీనికి దగ్గరగా మాట్లాడారు. శ్వేత పత్రం విడుదల చేసిన క్రమంలో స్పష్టమైన సంకేతాలు పంపారు. భావోద్వేగాలతో కూడిన వ్యవహారం కావడంతో జాగ్రత్తగా అడుగులు వేయనున్నారు.

అమరావతి రాజధాని నిర్మాణాన్ని.. 9 జోన్లుగా విభజించారు. 9 నగరాలు నిర్మించాలన్నది లక్ష్యం. అందుకు జీవో కూడా ఇచ్చారు. అయితే ఈ జోన్లలో.. ఆర్ 5 జోన్ కీలకం. ఇది రాజధాని ప్రాంతంలో 900 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు హయాంలో నిర్ధారించారు. మాస్టర్ ప్లాన్ లో సైతం దీనిని పొందుపరిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజధానికి మరో ఆదాయ వనరు ఈ ప్రాంతం. కానీ జగన్ సర్కార్ కీలకమైన ఆర్ 5 జోన్ విషయంలో వేరే ఆలోచనతో ముందుకు సాగింది. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలన్న ఆలోచనలో భాగంగా.. ఆర్ 5 జోన్ అంటే.. ఎవరైనా ఉండే ప్రాంతంగా నోటిఫై చేసింది. ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. గుంటూరు, ప్రకాశం, విజయవాడ ప్రాంతాలకు చెందిన పేదలకు ఇక్కడ ఇల్లు స్థలాలు కేటాయించింది. మొత్తం పది లక్షల మందికి ఇక్కడ సెంటున్నర చొప్పున స్థలాలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు లక్షల మందికి పట్టాలు పంపిణీ చేసింది. స్థలాల హద్దులు కూడా కేటాయించింది. ఇళ్ల నిర్మాణానికి పూనుకుంది. కానీ ఇంతలో అధికారం చేజారిపోయింది. అందుకే ఆర్ 5 జోన్ విషయంలో పునసమీక్షించి ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.

వాస్తవానికి అమరావతి రాజధాని నిర్మాణం ఇష్టం లేని జగన్.. అక్కడ భూములు ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని అమరావతి రైతులు తప్పుపట్టారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై కోర్టులో విచారణ కూడా జరిగింది. ఈ జోన్ లో ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పట్టాలపై మాత్రం కోర్టు తుది నిర్ణయం మేరకు నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే జగన్ సర్కార్ మొండిగా ముందుకు పోయింది. దాదాపు 3 లక్షల మందికి అక్కడ పట్టాలు ఇచ్చింది. అప్పట్లో చంద్రబాబు కూడా దీనిని వ్యతిరేకించారు. ఇప్పుడు చంద్రబాబు అమరావతి పై శ్వేత పత్రం విడుదల చేశారు. ఆర్ 5 జోన్ విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడతామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో అక్కడ ఇళ్ల స్థలాలు లేనట్టే. అయితే అక్కడ ఇళ్ల స్థలాలు పొందిన వారిలో ఎక్కువమంది వైసీపీ సానుభూతిపరులే. అందుకే అక్కడ సునాయాసంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.