Chandrababu: జగన్ కంటే వెనుకబడిన చంద్రబాబు

జగన్ గత నాలుగు సంవత్సరాలుగా నా ఎస్సీలు, నా బీసీలు అంటూ సంబోధిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపులో సైతం ఆ రెండు వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలకు గాను.. 19 మాలలకు, 10 సీట్లు మాదిగలకు ఇచ్చారు.

Written By: Dharma, Updated On : March 23, 2024 10:41 am

Chandrababu

Follow us on

Chandrababu: ఎన్నికల వ్యూహాల్లో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. వ్యూహ ప్రతి వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. మరోవైపు అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు. అధికార వైసిపి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తనకు లభించిన 144 అసెంబ్లీ సీట్లకు గాను.. 139 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. నేడు వారితో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేయనున్నారు. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. సామాజిక సమీకరణలకు పెద్దపీట వేశారు. అయితే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి రావడంతో.. చంద్రబాబు కొన్ని అంశాల్లో వెనుకబడ్డారు.

జగన్ గత నాలుగు సంవత్సరాలుగా నా ఎస్సీలు, నా బీసీలు అంటూ సంబోధిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు టిక్కెట్ల కేటాయింపులో సైతం ఆ రెండు వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 29 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలకు గాను.. 19 మాలలకు, 10 సీట్లు మాదిగలకు ఇచ్చారు. 48 నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చారు. 22 చోట్ల కాపులకు టికెట్లు కేటాయించారు. ఇప్పటివరకు బీసీలు టిడిపి వైపు నడిచారు. వారి అభిమానాన్ని చూరగొనేందుకు ఎక్కువగా సీట్లు కేటాయించారు. వారు వైసీపీ వైపు టర్న్ అయ్యేలా టికెట్లలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కాపులు ఎక్కువగా జనసేన వైపు వెళ్తారని అంచనా వేశారు. అందుకే కాపులకు మెజారిటీ సీట్లు కట్టబెట్టారు.

అయితే జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబు సామాజిక సమీకరణలకు పెద్దపీట వేయలేదు. పొత్తులో ఉండడంతో అదో కుదరని పనిగా మారింది. 28 మంది బీసీ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారు. కాపులకు సంబంధించి కేవలం ఎనిమిది మందికే సీట్లు కేటాయించారు. ఎస్సీలకు సంబంధించి సైతం కేవలం రిజర్వ్డ్ స్థానాలకి పరిమితం చేశారు.అయితే జనసేన, బిజెపి ఎస్సీలకు ఎన్ని సీట్లు వస్తాయి? బీసీలకు ఎన్ని కట్టబెడతాయి? కాపులకు ఎన్ని ఖరారు చేస్తాయి? అన్నదానిపై క్లారిటీ రావాలి. వారిచ్చే సీట్లను కలిపి ప్రకటిస్తారా? అన్నది తెలియాలి. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు కంటే జగన్ సామాజిక సమీకరణలకు పెద్దపీట వేసినట్లు అయ్యింది.