Vangaveeti Radhakrishna : ఎమ్మెల్సీ.. ఆపై మంత్రి.. లోకేష్ తో వంగవీటి రాధాకృష్ణకు చంద్రబాబు రాయబారం*

రాష్ట్ర క్యాబినెట్ లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నేపథ్యంలో ఒక్క మంత్రి పదవి ఎందుకు ఖాళీ ఉంచారా? అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే అది ఓ కీలక నేత కోసమని తాజాగా తేలింది.

Written By: Dharma, Updated On : October 26, 2024 12:16 pm

Vangaveeti Radhakrishna

Follow us on

Vangaveeti Radhakrishna : వంగవీటి మోహన్ రంగ.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ వచ్చారు మోహన్ రంగా. ఆయన మరణించి మూడు దశాబ్దాలు దాటుతున్నా ఏపీ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు వంగవీటి రాధాకృష్ణ. 2004లో కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ అటు తరువాత రాజకీయంగా తప్పటడుగులు వేసి పవర్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేశారు. ఓటమి చవి చూశారు. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు రాధాకృష్ణ. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసిపి టిక్కెట్ ఆశించారు. దక్కక పోయేసరికి టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయినా ఆ పార్టీ ఓడిపోయింది. అయినా సరే అదే టిడిపిలో కొనసాగుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి పార్టీల తరుపున కూడా ప్రచారం చేపట్టారు. పార్టీ అధికారంలోకి రావడంతో రాధాకృష్ణకు పదవి ఖాయమని ప్రచారం సాగింది. అయితే ఇంతలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నారు. ఈ తరుణంలో నారా లోకేష్ రాధాకృష్ణను పరామర్శించారు. గుడ్ న్యూస్ చెప్పారని ప్రచారం సాగుతోంది.

* ఆ ఒక్క ఖాళీ ఆయన కోసమే
ప్రస్తుతం క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది. అది వంగవీటి రాధాకృష్ణ కోసమేనని ప్రచారం నడుస్తోంది. రాధాను ఎమ్మెల్సీ చేసి.. క్యాబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. త్వరలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవుల నియామకం జరగనుంది. అందులో భాగంగా రాధాకృష్ణకు చాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అటు తరువాత ఖాళీగా ఉన్న మంత్రి పదవిలోకి తీసుకుంటారని కూడా సమాచారం. ఇదే విషయాన్ని నారా లోకేష్ ద్వారా చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.

* ఒత్తిళ్లను ఎదుర్కొని
ఎన్నికల్లో టిడిపి కూటమికి గెలుపు కీలకం. అందులో కీలక భాగస్వామ్యం అయ్యారు వంగవీటి రాధాకృష్ణ. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఆయనపై చాలా రకాల ఒత్తిళ్లు వచ్చాయి. అయినా సరే ఆయన టిడిపిని వీడలేదు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. కాపు సామాజిక వర్గం ఓట్లను టర్న్ చేయడంలో సక్సెస్ అయ్యారు.గతంలో చంద్రబాబు రాధాకృష్ణ ఇంటికి వెళ్లారు. కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. రాధాకృష్ణ రాజకీయ జీవితానికి కూడా భరోసా ఇస్తామని చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో రాధాకృష్ణను ఎమ్మెల్సీ చేయడంతో పాటు క్యాబినెట్లో తీసుకునేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా కాపుల అభిమానాన్ని శాశ్వతంగా చూరగొనాలని భావిస్తున్నారు. మొత్తానికైతే వంగవీటి రాధాకృష్ణకు పొలిటికల్ మైలేజీ వచ్చినట్టే.