Chandrababu: కాంగ్రెస్ తో చంద్రబాబుకు కొత్త భయం

వాస్తవానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చంద్రబాబు వ్యూహం కారణమని ప్రచారం జరిగింది. తెలంగాణ ఎన్నికల్లో ఫెయిల్ అయిన తర్వాత ఆమె.. ఏపీ వైపు చూశారు.

Written By: Dharma, Updated On : April 10, 2024 12:13 pm

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎంట్రీని అంతా లైట్ తీసుకున్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా భావించారు. అది ఇప్పుడప్పుడే పైకి లేవదని కూడా తేల్చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాకపోవచ్చు కానీ.. ఉనికి చాటుకునే అవకాశం ఉంది. ఇతర పార్టీల గెలుపోటములను నిర్దేశించే స్థాయికి చేరుకునే ఛాన్స్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో ఎవరికి నష్టం అంటే ముందుగా గుర్తొచ్చేది వైసిపి. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చింది కాబట్టి.. వైసీపీలో ఉన్నది మెజారిటీ కాంగ్రెస్ క్యాడర్ కాబట్టి.. కచ్చితంగా వైసీపీకి నష్టం కలుగుతుందని అంతా అంచనా వేశారు. పైగా వైఎస్ షర్మిల వైసిపి తో పాటు సోదరుడు జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వైసీపీకే నష్టమని భావించారు. కానీ ప్రధాని మోదీ హెచ్చరించేసరికి చంద్రబాబు అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం ప్రారంభించారు.

వాస్తవానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చంద్రబాబు వ్యూహం కారణమని ప్రచారం జరిగింది. తెలంగాణ ఎన్నికల్లో ఫెయిల్ అయిన తర్వాత ఆమె.. ఏపీ వైపు చూశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ పగ్గాలు అందుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక చంద్రబాబు ఉన్నారన్నది వైసిపి ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే షర్మిల కేవలం వైసీపీని టార్గెట్ చేశారు. సోదరుడు జగన్ పై గురి పెట్టారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి తరచూ ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో వివిధ పార్టీల సీట్లు దక్కని వారు కాంగ్రెస్ లో చేరుతున్నారు. అన్నింటికీ మించి తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేసరికి.. ఏపీలో కాంగ్రెస్ అభిమానులు యాక్టివ్ కావడం ప్రారంభించారు. దీంతో గత రెండు ఎన్నికల కంటే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికి పెరిగే అవకాశం ఉంది. ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. ఇప్పటికే వైసీపీ, ఎన్డీఏ మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. ఆ రెండు పార్టీల స్థాయిలో బలం చూపకున్నా.. త్రిముఖ పోరులో ఇండియా కూటమి నిలిచే అవకాశం ఉంది. పైగా షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను బరిలో దించుతోంది. డాక్టర్ కిల్లి కృపారాణి, సాకే శైలజానాథ్, పల్లం రాజు, జెడి శీలం వంటి సీనియర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తున్నారు. కొంతమంది వ్యక్తిగత ప్రభావం కూడా చూపగలరు. అయితే ఇప్పటివరకు షర్మిల రాకను ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని భయం వెంటాడుతోంది. అందుకే చంద్రబాబు సైతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి టర్న్ అయిన క్యాడర్లో చీలికతో పాటు వైయస్ కుటుంబ అభిమానుల్లో చీలిక తెస్తే.. అది కూటమికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ తో వైసీపీకే కాదు కూటమికి సైతం ప్రమాదం పొంచి ఉందన్నమాట.