AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. కూటమి ప్రభుత్వం ఇద్దరి నేతల పేర్లను సిఫారసు చేయనుంది. అయితే ఈసారి ఆ ఇద్దరు నేతలు టిడిపికి చెందినవారు అవుతారని అంతా భావిస్తున్నారు. ఆ రెండు పదవులు తీసుకోవాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇప్పుడు సమయం దగ్గరవుతుండడంతో ఇద్దరు నేతల ఎంపిక అనివార్యంగా మారింది. అయితే టిడిపిలో చాలామంది ఆశావహులు ఉన్నారు. కానీ సామాజిక సమీకరణలతో పాటు సీనియారిటీని గుర్తించాలని భావిస్తున్నారు. అటువంటి వారి ఇద్దరి పేర్లను ప్రకటించనున్నారు.
* ఆశిస్తున్న సీనియర్లు..
ప్రధానంగా పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన వారు ఉన్నారు. అయితే సామాజిక సమీకరణలో భాగంగా ఈసారి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరిని.. రాయలసీమ బలిజ/ కాపు సామాజిక వర్గం వారి నుంచి ఒకరిని ఎంపిక చేయనున్నారు. ఆ ఇద్దరు నేతల ఎంపికపై చంద్రబాబు దృష్టి పెట్టారు. కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తమకు కూడా అవకాశం ఇవ్వాలని చాలామంది జూనియర్ నేతలు సైతం కోరుతున్నారు. అయితే రాజ్యసభ పదవి ఆశించిన నేతలకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
* వర్ల రామయ్యకు ఖరారు..
ప్రధానంగా వర్ల రామయ్యకు పదవి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవి అనేసరికి వర్ల రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒకసారి ఓడిపోతానని తెలిసి కూడా పార్టీ ఆదేశాలు మేరకు రామయ్య పోటీ చేశారు. మొన్నటి రాజ్యసభ పదవులు ఎంపికలో సైతం వర్ల రామయ్య పేరు వినిపించింది. అందుకే ఒక పదవిని ఆయనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక రెండో స్థానం రాయలసీమ నుంచి ఎంపిక చేయనున్నారు. సీనియర్ నేత సుగవాసి ప్రసాద్ బాబుకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2012లో రాయచోటి నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. గత మూడు ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. ప్రసాద్ బాబు సేవలను గుర్తించిన పార్టీ హై కమాండ్ ఎమ్మెల్సీ ఇస్తామని గతంలోనే బాహటంగానే ప్రకటించింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ బాబును ఈసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.



