Chandrababu appreciation for Bandla Ganesh: బండ్ల గణేష్( Bandla Ganesh).. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా ఎదిగిన ఒక సాధారణ నటుడు. అనతి కాలంలోనే సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. రాజకీయంగాను సుపరిచితులు. పొలిటికల్ గాను భిన్నంగా ఉంటారు బండ్ల గణేష్. ఆయన కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకలు నిన్ననే ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే అందరికంటే మించి ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరు కావడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు బండ్ల గణేష్. అక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. హైదరాబాదులో జరిగిన ఈ వేడుకలకు రేవంత్ హాజరు కాలేదు. చంద్రబాబు హాజరు కావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.
పవన్ కు వీరాభిమాని..
వాస్తవానికి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆయనను ఎంతో ఇష్టపడుతుంటారు. పవన్ కళ్యాణ్ పై ఎవరైనా విమర్శలు చేస్తే తట్టుకోరు. గట్టిగానే కౌంటర్ ఇస్తారు. గతంలో మాజీ మంత్రి రోజాను అయితే ఇచ్చి పడేశారు. అంతలా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. పవన్ జనసేన ఏర్పాటుతో బండ్ల గణేష్ ఆ పార్టీలో చేరుతారని అంతా భావించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బండ్ల గణేష్. చట్టసభలకు పోటీ చేయాలని భావించారు కానీ ఛాన్స్ దక్కలేదు. అయినా సరే అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో నమ్మకం గానే ఉంటారు.
ఆ అభిమానంతోనే..
అయితే ఇటీవల బండ్ల గణేష్ రాజకీయ వైఖరి మారుతోంది. ఆయన ఎక్కువగా చంద్రబాబును ఇష్టపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో అయితే పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. కన్నీటి పర్యాంతమవుతూ మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వ సమర్థతను చాటి చెప్పే ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే తిరుమల వచ్చి మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్నారు. మొన్ననే హైదరాబాదు నుండి తిరుపతికి పాదయాత్రగా వెళ్లి మొక్కు చెల్లించుకున్నారు. ఇటీవల చంద్రబాబును కూడా కలిశారు. తన కుమార్తె నిశ్చితార్థ వేడుకలకు రావాలని కోరారు. ఆ విన్నపాన్ని మన్నించి చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. బండ్ల గణేష్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు వచ్చారు కానీ.. తెలంగాణ సీఎం రేవంత్ హాజరు కాకపోవడం చర్చకు దారి తీస్తోంది.